Ad Code

భారత కరెన్సీలో నాలుగు లక్షల నలభై వేల రూపాయలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి అనేకానేక ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, బ్రిటన్‌లో ఇటీవలే బయో ఇంధనం ఆధారంగా పనిచేసే రైలును ఇటీవలే ప్రవేశపెడితే, అమెరికాలో మోటార్‌ సైకిళ్లు రూపొందించే ఒక కంపెనీ బ్యాటరీ ఆధారంగా పనిచేసే మోటార్‌ సైకిల్‌ను రూపొందించింది. దీని సాయంతో వాతావరణ కాలుష్యాన్ని భారీగా తగ్గించవచ్చునని సంస్థ తెలుపుతోంది. అంతేగాక, ఈ మోటార్‌సైకిల్‌ను గ్యాస్‌ ఆధారంగా పనిచేసే విధంగానూ మార్చుకోవచ్చునని సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ బైక్స్‌ల ద్వారా వేగంగా వెళ్లే సౌకర్యం ఉంటే, ఈ బ్యాటరీ బైక్‌ల ద్వారా గరిష్ఠంగా 40కిలో మీటర్లు వెళ్లే సౌకర్యం ఉండటంతో చాలా మంది వీటి వాడకం పట్ల విముఖత చూపుతున్నారు. అయితే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చేసిన బ్యాటరీలను వినియోగించటంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు కంపెనీ తెలిపింది. దీంట్లో బ్యాటరీ గతంలో వాడే బ్యాటరీల కంటే ఎక్కువ సేపు బ్యాకప్‌ ఇస్తుందని, తద్వారా ఎంతో వేగంగా వెళ్లటం సాధ్యమౌతుందని సంస్థ తెలుపుతోంది. సాధారణ బ్యాటరీలతో వేగంగా వెళితే బ్యాటరీ కూడా తొందరగా వేడి ఎక్కి, అందులో ఉన్నటువంటి విద్యుత్‌ను త్వరగా అయిపోతుందని, కానీ ఆ సమస్యకు బ్యాటరీ డిజైనింగ్‌, రూపకల్పనలో మార్పులు చేయటం ద్వారా అధిగమించినట్లు వెల్లడించింది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగనటువంటి బ్యాటరీల రూపకల్పన చేసినట్లు తెలిపింది. సాధారణ బ్యాటరీల కంటే లిథియం అయాన్‌ బ్యాటరీల్లో చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా విద్యుత్‌ను ఎక్కువసేపు నిల్వ ఉండే సామర్థ్యం సంతరించుకునేటట్లు చేసినట్లు తెలిపారు.

ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్‌పై వీటిని రూపకల్పన (డిజైనింగ్‌) చేయటం వల్ల, మెరుగైన మైలేజి వస్తుంది. వీటి రూపకల్పనలో సాధ్యాసాధ్యాలపై ప్రత్యేకంగా ఎన్విరాల్‌మెంట్‌ ప్రొటక్షన్‌ ఏజన్సీ అనేది ఏర్పాటుచేయబడింది. ఈ ఏజన్సీ పరిశీలనలో ఇలా బ్యాటరీ ఆధారంగా తయారైన వాహనాలను స్పోర్ట్స్‌ వాహనాలుగానూ వినియోగిస్తున్నారని తెలిసింది. ఇవి ఇతర ఇంధనాలు ఆధారంగా పనిచేసే వాటితో సమానంగా వేగంగా ప్రయాణిస్తున్నాయని, భద్రతా ఏర్పాట్లు బావున్నట్లు వెల్లడైంది. ఇలా వాహనాలు తయారు చేస్తున్న వెట్రిక్స్‌ సంస్థ తాము ఇప్పటి వరకు తయారు చేసిన వాహనాల్లో ఎటువంటి సాంకేతిక లోపాలు వెల్లడికాలేదని, బ్యాటరీలు సైతం ఎక్కువ కాలం మన్నుతున్నట్లు తెలిపింది. సాధారణంగా గతంలో బ్యాటరీ వాహనాలు గంటకు 65కి.మీ వేగంతో వెళితే, స్పోర్ట్‌ వాహనాలుగా వీటిని మార్చటానికి వాటి గేర్‌బాక్స్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు వెట్రిక్స్‌ సంస్థ తెలిపింది. దీంతో బ్యాటరీ బైక్స్‌ను స్పోర్ట్స్‌లోనూ వినియోగించటం పెరిగిందని తెలుపుతున్నారు. ఇంత వరకు ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో లెడ్‌-ఆసిడ్‌ బ్యాటరీలనే వినియోగిస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్‌ మోటార్‌సైకిల్స్‌లో లిథియం అయాన్‌ బ్యాటరీలతో రూపొందించటం ప్రారంభించారో, అప్పటి నుంచి వీటి వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం దీన్ని 11వేల డాలర్లుగా (భారత కరెన్సీలో నాలుగు లక్షల నలభై వేల రూపాయలు) సంస్థ తెలుపుతున్నా, విక్రయాలు భారీగా పెరిగితే తగ్గించే అవకాశాలున్నట్లు అంటోంది. అయితే, దీని జీవిత కాలం పదిసంవత్సరాలుగా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. వీటిలో రకరకాలైన మోడల్స్‌ ఉన్నాయి. మనదేశంలోనూ రకరకాలైన కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయి. మన దేశంలో వీటి ప్రారంభ ధర 35 వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి.
ప్రత్యేకతకు కారణం ఇదే:
లిథియం అయాన్‌ బ్యాటరీతో బ్యాటరీ బైక్‌ రూపొందించటమే. ఎందువల్ల అంటే.. లిథియం అయాన్‌ బ్యాటరీలు ఇప్పటి వరకు సెల్‌ఫోన్స్‌లో వినియోగిస్తున్నారు. వీటికి చిన్నపాటి మార్పులు చేసి ఎక్కువ సేపు బ్యాటరీ నిల్వ ఉండేవిధంగా రూపుదిద్దారు. దీంతో పాటు, ఇతర బ్యాటరీలు విద్యుత్‌శక్తిని వేగంగా విడుదల చేసేటప్పడు అంతేవేగంగా బ్యాటరీలోని శక్తిని కోల్పోతాయి. కానీ, లిథియం అయాన్‌ బ్యాటరీ ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. అంతేగాక, ఇతర బ్యాటరీలు వేడి ఎక్కువ అయితే, మండే స్వభావం కలిగి ఉండటమేగాక, ఒక్కోసారి విస్ఫోటనం చెందుతాయి. కానీ, లిథియం అయాన్‌ బ్యాటరీలు వేగంగా వెళుతున్నా, వేడిని తట్టుకునే స్వభావంతో ఉండేవిధంగా రూపొందించారు.
ఉపయోగాలు ఇవే:-
ఎలక్ట్రిసిటీ బైక్‌ను వినియోగించటం వల్ల ప్రధానంగా వాతారణ కాలుష్యం గణనీయంగా తగ్గటమే గాక, ఇంధనం ఖర్చు సైతం భారీగా తగ్గుతుంది.
దీని వినియోగం వల్ల వినియోగదారుడుకు కిలోమీటరు పావలా ఖర్చుకే వెళ్లవచ్చునని తయారీదారులు తెలుపుతున్నారు.
ఇతర స్పోర్ట్స్‌ వాహనాలకు ధీటుగా దీన్ని వినియోగించవచ్చును.
వేగానికి వేగం, మైలేజికి మైలేజి.
బరువు కేవలం 85 కేజీలు.
శబ్ధం ఉండదు, పైకి కనిపించని ఇతర ఖర్చులు ఏమీ ఉండవు.
300 కిలోమీటర్లకు ఒకసారి ఎలక్ట్రికల్‌ రీఛార్జింగ్‌ చేస్తే సరి.

Post a Comment

0 Comments

Close Menu