కోళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలో, కోడి మాంసం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్కు దన్నుగా నిలిచే సరికొత్త పరిజ్ఞానాన్ని కేరళకు చెందిన పశు వైద్యుడు జాన్ అబ్రహం ఆవిష్కరించారు. చికెన్ వ్యర్థాల నుంచి బయో డీజిల్ తయారు చేశారు. తాజాగా ఈయన అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు మంజూరు చేసింది. డాక్టర్ జాన్ అబ్రహం ప్రస్తుతం కేరళలోని వయనాడ్ జిల్లా పుకొడ్ వెటర్నరీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడులోని నమక్కల్ వెటర్నరీ కళాశాలలో డాక్టోరల్ రిసెర్చ్ చేస్తుండగా చికెన్ వ్యర్థాలనుంచి బయో డీజిల్ను తయారుచేసే పరిజ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేశారు. 2014లోనే పేటెంట్ల కోసం తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వర్సిటీ తరఫున దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు ఆమోదం లభించింది.
2014లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అందించిన రూ. 18 లక్షలతో పాటు.. పుకొడ్ వెటర్నరీ కళాశాల క్యాంపస్ లోనే పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన చికెన్ వ్యర్థాల నుంచి బయో డీజిల్ తయారుచేసే ప్లాంట్ను ఆయన ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్లోనే కొచ్చిలోని భారత్ పెట్రోలియం రిఫైనరీ నిపుణులు తమ ప్లాంట్ను సందర్శించి, బయో డీజిల్ నాణ్యతను ధృవీకరించారని జాన్ అబ్రహం తెలిపారు. నాటి నుంచి పుకొడ్ వెటర్నరీ కళాశాలకు చెందిన ఒక వాహనాన్ని ఈ ఇంధనంతోనే నడుపుతున్నామని చెప్పారు. దాదాపు 100 కేజీల చికెన్ వ్యర్థాల నుంచి ఒక లీటరు బయో డీజిల్ ఉత్పత్తి అయిందని, దీన్ని మార్కెట్లో లీటరుకు రూ.59 చొప్పున విక్రయించొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
0 Comments