Ad Code

ఏపీలో పోస్టాఫీసులు ఇకపై 34 పౌర సేవలు

 


నవంబరు నెలాఖరు కల్లా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ సర్వ సేవా కేంద్రాలు (సీఎస్‌సీ)గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ తపాలా సేవలు మాత్రమే ఉండగా, ఇకనుండి 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కంప్యూటర్లు అందుబాటులో ఉండి,  శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చేశారు. మరో రెండు నెలల్లో 8,504 పోస్టాఫీసులను సీఎస్‌సీలుగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్‌ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్‌టీఏ, డీటీహెచ్‌ సేవలు, విద్యుత్తు, నీటి బిల్లులు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్‌ట్యాగ్‌ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్‌ ధన్‌ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు వంటి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డాక్టర్ అభినవ్‌ వాలియా మాట్లాడుతూ.. తపాలా శాఖకు ఉన్న పరిధిని ఉపయోగించుకుని అన్ని గ్రామాలకూ ఈ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సీఎస్‌సీలలో అందించే సేవలపై రాష్ట్రంలోని నాలుగు వేల మందికిపైగా తపాలా శాఖ సిబ్బంది తర్ఫీదు పొందారని అన్నారు. అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తపాలా సీఎస్‌సీల ద్వారా సుమారు రూ.1.30 కోట్ల విలువైన 11,710 లావాదేవీలు చేశామని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu