Ad Code

టంటంట టంటంట టటంట టంటం


ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా "టంటంట టంటంట టటంట టంటం' అని కూనిరాగం తీస్తూ సభకు వచ్చాడట. మంత్రి కేమీ  అర్థం కాలేదు రాజా! కవులను కావ్య గానం చేయమన్నారా?లేక మీరేదయినా సమస్య యిస్తారా? అని అడిగాడు. రాజు నవ్వుతూ ఇదే సమస్య "టంటంట టంటంట టటంట టంటం" దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా మూడు పాదాలూ పూరించాలి. సభలో బాణుడు, భవభూతి తో సహా అందరు కవులూ రాజు కేమైనా పిచ్చి పట్టిందా అని నివ్వెర పోయి చూస్తున్నారు. కాళిదాసు మాత్రం ముఖం లో ఏ భావమూ చూపకుండా కూర్చున్నాడట. అప్పుడు భోజ  రాజు మహాకవీ మీరు కూడా నాకు మతి పోయిందనుకుంటున్నారా? అని అడిగాడు. అంత ధైర్యం నాకు లేదు ప్రభూ! సమస్య యింకో మారు వివరించండి అన్నాడు.కాళిదాసు. .దానికి రాజు  కుమార సంభవ కావ్యం లో మీరు రాసిన 'అస్తుత్తరస్యాం దిశి దేవాతాత్మా"అన్నట్లు యింద్రవజ్ర వృత్తములోని పాదం యిది. ఈ వృత్తం మీకు కొట్టిన పిండే కదా పూరించండి.అని సమస్య మరోమారు వినిపించాడు.. వెంటనే కాళిదాసు అయిదు క్షణాలు కళ్ళు మూసుకొని యిలా చెప్పాడు. 

'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:

హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః 

సోపాన మార్గేషు కరోతి శబ్దం 

టంటంట టంటంట టటంట టంటం"

రాజు ఆశ్చర్యం తో అలా చూస్తూండి పోయాడు. అలా చూస్తారేమి మహారాజా! అర్థం సులభమే కదా! నేను సభకు అర్థం వివరిస్తాను. రాజు గారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మన్మధ మదం లో మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మెట్ల  మీదు గా దొర్లుతూ మీరు చెప్పినట్టు 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది. 

భోజరాజు ఆశ్చర్యంగా మహా కవీ! మీరు ఉదయం స్నాన ఘట్టం దగ్గర లేరు కదా! మీరెలా చెప్ప గలిగారు?

నేను మీ ఉల్లాసాన్ని చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పాను. అన్నాడు కాళిదాసు. భోజ రాజు సింహాసనం మీది నుంచి లేచి వచ్చి కాళిదాసును కౌగలించుకొని అక్షరలక్ష లిచ్చిగౌరవించాడు.భోజరాజు మనసులో వుండేది కాళిదాసు చెప్పగలుగుతాడు.. అందుకే కాళిదాసును మహాకవి అన్నారు. .

Post a Comment

0 Comments

Close Menu