ఈ సమయంలోనే అతను అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం అతని మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం అతని దృష్టిలో నేరము. 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.
భారతదేశములో పోరాటము ఆరంభ దశ
1915లో భారతదేశం తిరిగివచ్చిన గాంధీ దంపతులు
భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్థించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదం. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918లో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో "బాపు" అనీ, "మహాత్ముడు" అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసయినా తప్పే. 1919 ఏప్రిల్ 13న పంజాబు లోని అమృత్ సర్, జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెసుకు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము "స్వరాజ్యము" అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ, ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.
1921లో ఆంధ్ర పర్యటనలో గాంధీ
"స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లివిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.
"సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరాలో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు.
"సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్యం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.
1922లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు. 1927 లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 న లాహోరులో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.
విజయవాడ పర్యటన
సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించాడు. దీనివలన తెలుగువారిలో గొప్ప చైతన్యమొచ్చింది. కె.ఎన్. కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్దమార్పులు వచ్చాయి.
పతాకస్థాయి పోరాటము
దండి సత్యాగ్రహం మార్గం
ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932లో లండనులో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్న కులాలవారినీ, ముస్లిములనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. ఆరోజుల్లో అంటరానివారిగా పరిగణిస్తున్న వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934లో అతనిపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయ నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదనీ అతని ఉద్దేశము.
1936లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోసుతో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది.
"క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.
0 Comments