Ad Code

పశువులకూ సరోగసీ!

 

పశువుల్లోనూ అద్దె గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులోని లాం పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగం అమలు చేస్తుండగా తాజాగా ప్రకాశం జిల్లా చదలవాడ పశు క్షేత్రంలోనూ ఉత్తమమైన ఒంగోలు ఆవుల జాతిని వృద్ది చేసేందుకు అధికారులు ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో ఆవు తన జీవితకాలంలో 9 నుంచి 15 దూడల వరకు జన్మనిస్తుంది. వాటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసీ విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు 'ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌' సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో వినియోగిస్తున్నారు. నాణ్యమైన పశువు జాతిల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో దాదాపు 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధికంగా 15 దూడలకు జన్మనిచ్చిన తర్వాత సహజసిద్ధమైన కలయిక వల్ల కానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది. గాయాలుపాలైనా, వయసుపైబడినా గర్భం నిలవదు. అలాంటి ఆవులు.. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ సాంకేతికత ద్వారా దూడలకు జన్మనివ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ జాతి పశువులకు చెందిన అండాన్ని ప్రవేశపెడితే.. అదే జాతి దూడ జన్మిస్తుంది. తల్లి లక్షణాలు మాత్రం వాటికి రావని పశు వైద్యులు చెబుతున్నారు. పశువుల ఉత్తమ జన్యు లక్షణాలను అభివృద్ధి చేసి పాలఉత్పత్తిని పెంచడంతో పాటు, మేలురకమైన పశు సంపద పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఏఐపీ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఒంగోలు, ముర్రా, జెర్సీ ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి స్థానిక ఆవులు, గేదెల్లో ప్రవేశపెట్టి ఉత్తమ లక్షణాలు గల పశుసంతతిని అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పశువులను ఈ పరిజ్ఞానంతో సంకరజాతి పశువులకు ధీటుగా మార్చేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఒంగోలు, ముర్రా, జెర్సీ ఆంబోతుల వీర్యాన్ని వినియోగిస్తుండటంతో పశువుల్లో జన్యు లక్షణాలు అభివృద్ధి చెంది మూడు తరాల తర్వాత అవి పూర్తిస్థాయి సంకరజాతి లక్షణాలను పులుముకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. పాడి పశువుల్లో జన్యు లక్షణాల మెరుగుదలకు అనుసరించే సాంకేతిక పద్ధతుల్లో కృత్రిమ గర్భధారణ ప్రధానమైంది. అత్యుత్తమ లక్షణాలు కలిగిన దున్నపోతులు, ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ద్రవరూప నత్రజని కంటైనర్లలో నిల్వ ఉంచుతారు. ఆవులు, గేదెలు, గర్భధారణకు అనుకూలమైన సమయంలో ఉన్నపుడు ప్రత్యుత్పత్తి ట్యూబ్‌ద్వారా ఆ వీర్యాన్ని ప్రవేశపెడతారు. ఆవుల్లో ఎదకు వచ్చిన 12 నుంచి 14 గంటల మధ్య గర్భధారణ చేస్తారని పశు వైద్య నిపుణులు వివరించారు. గేదెలు సెప్టెంబరు నుంచి మార్చి వరకు, ఆవులు సంవత్సరం పొడవునా ఎదకు వస్తాయి. యుక్త వయస్సుకు వచ్చిన పశువు అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మో న్ల ప్రభావం వల్ల ఎద లక్షణాలు గుర్తిస్తారు. ఆవుల్లో ఎదకాలం 18 నుంచి 24 గంటలు, గేదెల్లో 24 నుంచి 35 గంటల కాలం ఉంటుందని నిపుణులు తెలిపారు. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని మరో మేలు జాతి ఆవు అండంలో ప్రవేశపెట్టి పిండాన్ని అభివృద్ది చేసిన అనంతరం ఎదకు వచ్చిన స్థానిక ఆవుల గర్భంలో పిండాన్ని ప్రవేశపడతారు… దీని ద్వారా మేలు జాతి పశువులు అభివృద్ధి అవుతాయి. దీని ద్వారా స్థానిక పశువుల్లో కూడా మేలు జాతి లక్షణాలు పెంపొందింపజేయవచ్చు. పశువుల్లో వచ్చే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చునని పశువైద్యులు చెబుతున్నారు. మేలు జాతి దూడలు పుట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల రైతులకు పాల ఉత్పత్తిలో, వ్యవసాయంలో లబ్ధి చేకూరుతుందని చదలవాడ పశుక్షేత్రం పశు వైద్యులు చెబుతున్నారు. చదలవాడ పశుక్షేత్రంలో దేశీయ ఆవులు 300 వరకు ఉన్నాయి… ప్రస్తుతం సరోగసీ విధానం ద్వారా ఎక్కువ దూడలను పుట్టించి వెయ్యి పశువుల వరకు మేలుజాతి రకాలను ఉత్పత్పి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అవసరమైన పచ్చిగడ్డి, దాణాలను సమకూర్చుకునేందుకు పశుక్షేత్రం ఆధీనంలో ఉన్న 200 ఎకరాల్లో పచ్చిగడ్డిని పెంచుతున్నారు. సంవత్సరకాలం పాటు గడ్డి లభించేలా చర్యలు తీసుకున్నారు. ఇక, చదలవాడ పశుక్షేత్రంలో సరోగసీ విధానంలో పుట్టిన లేగదూడలు.. చెంగు చెంగున ఎగురుతూ కనువిందు చేసే దృశ్యాలు కనిపించనున్నాయి. తద్వారా అంతరించి పోతున్న మేలుజాతి రకాలైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువులు మరింత అభివృద్ది చెందుతాయి.

Post a Comment

0 Comments

Close Menu