5G నెట్వర్క్ విషయంలో భారత్ మరో ముందడుగు వేసింది. రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కోసం మొదటిసారి 5G ట్రయల్స్ను గురువారం ప్రారంభించింది. గుజరాత్లోని అజోల్ గ్రామంలో ఈ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో, గాంధీనగర్లోని ఉనావా పట్టణంలో బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్ ఏర్పాటు చేసి నెట్వర్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ స్పీడ్ను అధికారులు లెక్కించారు. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు, రెండు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీతో కూడిన బృందం అజోల్ గ్రామానికి చేరుకుంది. ఈ టీమ్లో డీడీజిలు రోషమ్ లాల్ మీనా, అజాతశత్రు సోమాని, డైరెక్టర్లు వికాస్ దాధిక్, సుమిత్ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. వారితో పాటు నోకియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) టెక్నికల్ టీమ్స్ కూడా ఉన్నాయి. 5G ట్రయల్స్ సందర్భంగా పీక్ డౌన్లోడ్ స్పీడ్ 105.47Mbps, పీక్ అప్లోడ్ స్పీడ్ 58.77Mbpsగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ట్రయల్స్ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. "5G BTS ఉన్న ఉనావా పట్టణానికి 17.1 కి.మీ దూరంలో ఉన్న అజోల్ గ్రామంలో 105 Mbps కంటే ఎక్కువ పీక్ డేటా డౌన్లోడ్ స్పీడ్ను గమనించాం. ఇది రూరల్ బ్రాడ్బ్యాండ్ కవరేజీ కోసం భారత్లో టెస్ట్ చేసిన మొట్టమొదటి 5G ఇన్నొవేషన్ సొల్యూషన్" అని ట్వీట్లో పేర్కొంది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్లతో కూడిన 5G ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 360 డిగ్రీస్ కెమెరాలు, వర్చువల్ రియాలిటీ కనెక్టెడ్ క్లాస్ రూమ్స్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ కంటెంట్ ప్లేబ్యాక్ వంటి వాటిని ట్రయల్ సైట్లో టెస్ట్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
0 Comments