ప్రస్తుతం పరిచయం అక్కర్లేని యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాడే యాప్ ఇది. ఎవరికైనా మెసేజ్ పంపించాలన్నా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపించాలన్నా, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవాలన్నా.. రూపాయి ఖర్చు లేకుండా కేవలం నెట్ ఉంటే చాలు వాట్సప్ ద్వారా వీటన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు.. అంటే ఇండియాలో దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్సప్ వల్ల వచ్చే ఒకే ఒక పెద్ద సమస్య ప్రైవసీ. యూజర్ల డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది. వాళ్లు పంపించే డాక్యుమెంట్లు, చాట్, ఫోటోలు, వీడియోలు హ్యాకర్లకు దొరకకుండా ఉంటాయి అని అనుకునే చాన్స్ అయితే లేదు. ఎందుకంటే.. వాట్సప్ ప్రైవసీపై ఇప్పటికే చాలాసార్లు ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. అందుకే చాలామంది వాట్సప్కు ఆల్టర్నేట్ మెసేజింగ్ యాప్వైపు చూస్తున్నారు. ఇండియన్స్ వాట్సప్ తర్వాత ఎక్కువగా టెలిగ్రామ్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత సిగ్నల్ యాప్ను వాడుతారు. సాధారణ వ్యక్తులు ఏ యాప్ వాడినా పెద్దగా నష్టం ఉండదు కానీ ప్రభుత్వ సంస్థలు, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ ఇటువంటి యాప్స్ ఉపయోగించి.. ముఖ్యమైన సమాచారాన్ని వాట్సప్లో షేర్ చేస్తే ఇంకేమైనా ఉందా? అవి లీక్ అయితే ఎంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇండియన్ ఆర్మీ ఓ ఆలోచన చేసింది. ఆర్మీ కోసం సొంతంగా వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్ను తయారు చేసింది. దానికి ASIGMA (Army Secure IndiGeneous Messaging Application) అనే పేరు పెట్టింది. ఈ యాప్ను ఇండియన్ ఆర్మీలోకి ఆఫీసర్ల టీమ్ డెవలప్ చేసింది. ఇప్పటి వరకు ఆర్మీ.. Army Wide Area Network (AWAN) మెసేజింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించేది. దీని ద్వారానే ఆర్మీ మెసేజ్లను ఫార్వార్డ్ చేసేది. గత 15 ఏళ్ల నుంచి ఈ సర్వీస్ను ఆర్మీ వినియోగిస్తోంది. తాజాగా దీని ప్లేస్లో అసిగ్మా యాప్ను డెవలప్ చేసింది. ఆర్మీ ఇంటర్నల్ అవసరాల కోసం దీన్ని మరింత సెక్యూర్గా డెవలప్ చేశారు. వాట్సప్, సిగ్నల్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడకుండా ఉండేందుకే ఆర్మీ సొంతంగా ఈ యాప్ను డెవలప్ చేసుకుంది. ఈ యాప్లో గ్రూప్ చాట్స్, వీడియో, ఇమేజ్ షేరింగ్, వాయిస్ నోట్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment