Ad Code

ఐఐటీ హైదరాబాద్ చే స్వదేశీ 'బేస్‌స్టేషన్‌ సెల్‌ టెక్నాలజీ'


వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ స్టార్టప్ కంపెనీ సహాయంతో తొలి 5జీ డేటా కాల్‌ చేసినట్లు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌ శాస్ర్తవేత్తలు వెల్లడించారు. ఓరాన్ టెక్నాలజీ (ఓపెన్ రెడియో యాక్సెస్ నెట్‌వర్క్) సహాయంతో 5జీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ మనదేశం 2G, 3G, 4G టెక్నాలజీలను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో కొన్ని వైర్‌లెస్ పరికరాలు మన దగ్గరే తయారవుతునప్పటికీ, మొత్తం సాంకేతికత, మేధో సంపత్తి డిజైన్ స్థానికంగా అందుబాటులో లేవు. దీంతో ఈ లోటును భర్తీ చేసేవిధంగా ఐఐటీ-హైదరాబాద్ పరిశోధకులు 5జీ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేశారు. దీంతో టెక్నాలజీ పరంగా మనదేశం కీలక ముందడుగు వేసింది. 3.3-3.5 గిగాహెర్ట్‌జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 100 మెగా హెర్ట్‌జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్‌ చేసే మల్టిపుల్‌ ఇన్‌పుట్‌-మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సింగ్‌ ప్రాతిపదికన ఈ సాంకేతికతను భారతీయ వైర్‌లెస్‌ పరికరాల తయారీదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సాయిధీరాజ్‌ చెప్పారు. స్వదేశీ 'బేస్‌స్టేషన్‌ సెల్‌ టెక్నాలజీ' సహాయంతో 5జీ డేటా కాల్ విజయంతంగా చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ని అధిక వేగంతో అందించడమే కాకుండా ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌) సేవలను అందించవచ్చని తెలిపాయి. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇది కీలక పరిణామం అని ఐఐటీహెచ్‌ పరిశోధన-అభివృద్ధి విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కుచి తెలిపారు. తమ పరిశోధన ద్వారా 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ను మరింత ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 5జీ రంగంలో తమ టెక్నాలజీ దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చగలదని ఆశిస్తున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి అభిప్రాయపడ్డారు. వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ స్టార్టప్ కంపెనీని 2016లో ఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణంలోని రీసెర్చ్‌ పార్కులో ప్రారంభించారు. 5జీ సాంకేతికతపై అప్పటి నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగుతూ ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఈ సంస్థ 5జీ టెక్నాలజీపై ఇప్పటివరకు 100కు పైగా పేటెంట్లను డెవలప్ చేసింది. ఇందులో 15 పేటెంట్లు 5జీ టెక్నాలజీ వినియోగించడానికి అత్యవసరమైనవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక యూజర్ల వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగింది. ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం మరింత పెరగనుంది. దీంతో కొత్త కొత్త డివైజ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా మంది దగ్గర 5జీ ఫోన్లు ఉన్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu