Ad Code

ఒక్క జూమ్ కాల్ తో 3,000 మంది ఉద్యోగాలు హాంఫట్!


సీఈఓ విశాల్ గార్గ్ గుర్తున్నాడా?. గతేడాది డిసెంబర్లో కరోనా సెకండ్ వేవ్ ఊపందుకుంటున్న సమయంలో తమ సంస్థలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ఒక్క జూమ్ వీడియో కాల్ ద్వారా ప్రకటించాడు. అప్పట్లో ఈ వార్త కార్పొరేట్ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రకటనతో వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి ఏకంగా 3000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూమ్ ద్వారా ప్రకటించాడు. దీంతో మరోసారి విశాల్ గార్గ్ కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఆన్ లైన్లో “తనఖా” వ్యాపారం నిర్వహించే ఈ better.com సంస్థకు భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ గతేడాది సీఈఓగా నియమితులయ్యారు. సంస్థను స్థాపించిన వారిలో ఈయన కూడా ఒకరు. బోర్డ్ అఫ్ డైరెక్టర్ల నిర్ణయం మేరకు విశాల్ గత ఏడాది సీఈఓగా నియమించబడ్డాడు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వారానికే జూమ్ కాల్ ద్వారా 900 మందిని తొలగించాడు. ఉద్యోగులను తొలగించిన రెండు రోజులకే అధికారిక పర్యటనలో భాగంగా టూరుకి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం మరో 3000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జూమ్ వీడియో కాల్ ద్వారా ప్రకటించాడు విశాల్. better.comలో మొత్తం 9000 మంది పనిచేస్తుండగా వారిలో 3000 మందిని తొలగించాడు.. ఇది సంస్థలో మూడోవంతు ఉద్యోగుల సంఖ్య. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధి చెందితే తిరిగి కొందరిని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ తాత్కాలిక ప్రెసిడెంట్ కెవిన్ ర్యాన్ ప్రకటించాడు. ప్రస్తుతం తొలగించిన 3000 మంది ఉద్యోగులకు మూడు నెలల జీతం ముందస్తు చెల్లింపుతో పాటు ఆరోగ్య బీమా కూడా వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా better సంస్థ ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జూమ్ కాల్ ద్వారా వెల్లడించడం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇమెయిల్ ద్వారా లేదా ఆఫీస్ మీటింగ్ ద్వారా విషయం చెప్పాలిగాని.. ఇలా జూమ్ ద్వారా ప్రకటన చేసి ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu