బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G టెలికాం నెట్వర్క్ రోల్ అవుట్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకు దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తుంది. ఈ మేరకు టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో ఓ ప్రకటన చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. 4G టెలికాం నెట్వర్క్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. స్వదేశీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు దీన్ని మనదేశంలోనే అభివృద్ధి చేశారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 4G నెట్వర్క్ను అభివృద్ధి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని వైష్ణవ్ అన్నట్లు పీటీఐ పేర్కొంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఆరు వేల టవర్లను ఆర్డర్ చేసే ప్రక్రియలో ఉందని.. మొత్తంగా లక్షకు పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేనే పనిలో ఉందని టెలికాం మంత్రి తెలియజేశారు. ఈ టవర్లను ప్రత్యేకంగా 4జీ నెట్వర్క్ కోసం వినియోగించనున్నారు. పీటీఐ నివేదిక ప్రకారం.. 5G టెక్నాలజీపై మంత్రి స్పందించినట్లు తెలుస్తోంది. 5జీ సాంకేతికత సమాంతరంగా అభివృద్ధి జరుగుతోందని.. మరికొన్ని నెలల్లో అది కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది. రైళ్లలో 4G ఇంటర్నెట్ సేవల లభ్యతపై సభలో సభ్యులు అడిగినప్పుడు.. 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తేనే రైళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వస్తుందని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. గంటకు 100 కి.మీ వేగంతో నడిచే రైళ్లలో 4జీ టెక్నాలజీ ఏర్పాటు చేస్తే కమ్యూనికేషన్లలో అంతరాయం కలుగుతుందని ఆయన వివరించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీలు) మొబైల్ టవర్లపై ఏర్పాటు చేసిన బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లను ఫైబర్రైజ్ చేశారని మంత్రి పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరి 1నాటికి దేశంలో దాదాపు 7,93,551 BTSలు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ సాధించాయి. టిఎస్పిలకు చెందిన మొబైల్ కమ్యూనికేషన్లను బీటీఎస్ అందిస్తుందని టెలికాంమంత్రి చెప్పుకొచ్చారు. మైక్రో వేవ్తోపాటు ఫైబర్ లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని కనెక్ట్ చేసే నిర్ణయాలను TSP తీసుకుంటుందన్నారు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో అవసరమైన నెట్వర్క్ సామర్థ్యం వివిధ సాంకేతిక-వాణిజ్య పరిగణనలపై ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ ఆఫ్ వే రూల్స్, 2016 ప్రకారం రాష్ట్రాల ROW పాలసీని అలైన్మెంట్ చేయకపోవడం, అధిక ఛార్జీలు, కాంప్లెక్స్ ప్రక్రియ, రైట్ ఆఫ్ వే అనుమతులను పొందడంలో జాప్యం తదితర కారణాలు టెలికాం టవర్ల ఫైబరైజేషన్కు ప్రధాన అవరోధంగా మారాయని టెలికాం మంత్రి పార్లమెంటులోని లోక్ సభకు తెలియజేశారు. 4G టెక్నాలజీ కోసం అనుసరించిన నిబంధనల ప్రకారమే 5G సేవలను అందించడానికి BSNL, MTNL లకు పరిపాలనాపరంగా స్పెక్ట్రమ్ కేటాయించడానికి కేంద్రప్రభుత్వం గతవారం ఆమోదించింది. BSNL, MTNL సాంకేతిక-వాణిజ్య పరిగణనల ఆధారంగా 4G, 5G సేవలను విడుదల చేస్తాయి. ఏప్రిల్ 1న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ ఈ సమాచారాన్ని అందించారు.
0 Comments