ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయి. ఏప్రిల్ 18 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు ఇటీవలే మారుతి సుజుకీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ప్యాసింజర్ వాహన రేంజ్లో 1.3శాతం ధరల పెంపును ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు, MPV, SUVతో పాటు వ్యాన్ మోడల్ కూడా ఉన్నాయి. ఈ ధరల పెంపు ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 18, 2022 అమలులోకి వస్తాయి. ముడి సరకుల వ్యయం, నిర్వాహణ భారంతో పాటు వివిధ ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కార్ల ధరలను పెంచాల్సి వచ్చినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. అన్ని మోడళ్లలో వెయిటెడ్ యావరేజ్ పెరుగుదల ఎక్స్-షోరూమ్ ధరపై 1.3శాతం పెంచినట్టు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 6న మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపుపై ప్రకటన జారీ చేసింది. గత ఏడాదిలో వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో కంపెనీ వాహనాల ధరపై తీవ్ర ప్రభావం పడింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కంపెనీ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ కొత్త ధరలతో వినియోగదారులపై అదనపు ఖర్చుల ప్రభావం ఉంటుందని మారుతీ సుజుకి ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకీ గతంలోనే వివిధ మోడళ్లకు ధరల పెరుగుదలపై ప్రకటన చేయగా.. ప్రస్తుతానికి, భారత మార్కెట్లో మారుతీ సుజుకీ పోర్ట్ఫోలియోలో ఆల్టో, S-ప్రెస్సో, వ్యాగన్ R, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్, 2022 ఎర్టిగా విటారా బ్రెజ్జా ఉన్నాయి. కంపెనీ అరేనా డీలర్షిప్ల ద్వారా కార్లను విక్రయిస్తోంది. కొత్త బాలెనో , ఇగ్నిస్, సియాజ్ S-క్రాస్ మారుతి సుజుకీ ప్రీమియం నెక్సా రిటైల్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మారుతి సుజుకీ నుంచి XL6 త్వరలో Nexa లైనప్లో రాబోతోంది. ఈ ప్రీమియం MPV కారుపై 2022 XL6 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 11,000 టోకెన్ మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా మారుతి సుజుకీ నెక్సా డీలర్షిప్లో పొందవచ్చు. కొత్త 1.5-లీటర్ డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్ (103 PS/137 Nm), ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 4 ఎయిర్బ్యాగ్లతో 360డిగ్రీలతో వస్తుంది.
0 Comments