ఐటీఐ సాకేత్ విద్యార్థులు కేవలం పదిహేను రోజుల్లో సోలార్ బైక్ను తయారు చేసి తమ ప్రతిభను చాటారు. పూర్తిగా పాడయిపోయిన బైక్ను తీసుకొని దానికి పోలార్ ప్యానల్, బ్యాటరీని అమర్చి బైక్ను అభివృద్ధి చేసి ఐటీఐ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. సోలార్ బైక్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బైక్ను సూర్యకాంతిలో మూడు నుంచి నాలుగు గంటలపాటు ఉంచుతారు. అనంతరం బ్యాటరీ చార్జవుతుంది. ఇలా ఖర్చు లేకుండా నూట ఎనభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే ఎంచక్కా తిరగొచ్చు. చార్జింగ్ అయిపోతుందనే ఆందోళన కూడా అవసరం లేదు. మనం రోడ్లపై తిరుగుతున్న సమయంలోనే ఇది చార్జవుతుంది. బైక్ పేటెంట్ హక్కుల కోసం ఐటీఐ విద్యార్థులు సిద్ధమయ్యారు. సామాన్య ప్రజల కోసం కూడా సోలార్ పవర్తో నడిచే బైక్లను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఐటీఐ సాకేత్ కోఆర్డినేటర్ బనీ సింగ్ చౌహాన్ చెప్పారు. ఇలాంటి బైక్లు మార్కెట్లోకి వస్తే సామాన్యులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని అన్నారు. ఇక ఎగ్జిబిషన్లో ఈ బైక్ను చూసిన వారు.. చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రజలకు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. కాగా, మనదేశంలో ఇప్పుడిప్పుడే జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరలుతున్నారు. ధర కాస్త ఎక్కువైనప్పటికీ.. పెట్రోల్ భారం నుంచి తప్పించుకునేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఐతే ఎలక్ట్రిక్ బైక్స్ మంటల్లో కాలిపోయిన ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతుండడంతో.. కొంత ఆందోళన నెలకొంది. ఆ సమస్యలకు చెక్ పెట్టగలిగితే.. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదేనని నిపుణులు చెబుతున్నారు.
0 Comments