Ad Code

చంద్రుడిపై గుహలు !


చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మనకు కనిపించని చీకటి భాగంలో మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అలాంటి చందమామపై మనుషులు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్నకు తాజా పరిశోధనలో సమాధానం దొరికిందని నాసా పరిశోధకులు అంటున్నారు. చందమామపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా. అంతేకాదు ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉంటున్నాయని తేలింది. నాసాకు చెందిన లూనార్ రికనసెన్స్ ఆర్బిటర్ ఈ వివరాలను సేకరించింది. అంటే ఈ సొరంగాల్లోకి వెళ్లి అక్కడి గుహల్లో మనుషులు ఉండి, పరిశోధనలు చేయొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) పరిశోధకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈ గుహల్లో వ్యోమగాములు ఉండి తమ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని తెలియజేశారు. ఒకప్పుడు మనిషి గుహల్లోనే బతికేవాడని, ఇప్పుడు మళ్లీ చంద్రుడిపై గుహల్లోనే జీవితం ప్రారంభించాల్సి ఉంటుందని ఈ పరిశోధకులు వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu