Ad Code

ఇదంతా బుద్ధిలేని ప్రచారం !


గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సతీమణి నికోలే షనాహన్‌తో తనకు అఫైర్ ఉందంటూ వస్తున్న కథనాలపై టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్  స్పందించారు. ఇదంతా బుద్ధిలేని ప్రచారమని కొట్టిపారేశారు. పూర్తిగా అవాస్తవమని ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు. '' ఇదంతా బుద్ధిలేని ప్రచారం. సెర్గీ బ్రిన్, నేనూ స్నేహితులం. నికోలేని మూడేళ్ల వ్యవధిలో కేవలం రెండు  సార్లు మాత్రమే చూశాను. ఆ రెండు సందర్భాల్లోనూ చాలామంది అక్కడున్నారు. రోమాంటిక్‌ పనులకు ఆస్కారమే లేదు '' అని తేల్చిచెప్పారు. నికోలేతో మస్క్‌కు అఫైర్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తే వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటివల ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ రిపోర్ట్‌కి ఎలాన్ మస్క్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం నికోలేతో మస్క్ అఫైర్ వరకూ సెర్గీ బ్రిన్ - ఎలాన్ మస్క్ స్నేహంగా ఉండేవారని, ఆ తర్వాత స్నేహం తెగిపోయిందని పేర్కొంది. ఈ కథనాలను బలపరిచేలా ఈ ఏడాది జనవరిలో సెర్గీ బ్రిన్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టులో ఫైలింగ్ చేశారు. ఇద్దరిమధ్యా సరిదిద్దలేని విభేదాలు ఏర్పాడ్డాయని డైవర్స్ ఫైలింగ్‌లో సెర్గీ బ్రిన్ పేర్కొన్నారు. డిసెంబర్ 15, 2021 నుంచి దంపతులిద్దరూ దూరంగా ఉంటున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మరోవైపు డిసెంబర్ 2021లో మియామీలో జరిగిన ఆర్ట్ బాసెల్ ఈవెంట్‌లో సెర్గీ బ్రిన్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ చెప్పారని, ఒక మోకాలుని కిందికి వంచి సారీ చెప్పారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు విషయాన్ని తెలిపాయని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu