చంద్రుడిపైకి ఆర్టెమిస్-1 ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. కేప్ కెనావెరల్ నుంచి జాబిల్లిపైకి పంపేందుకు నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఉదయం 11.34 గంటలకు నింగిలోకి బయల్దేరనున్నది. ఈ మేరకు ఆదివారం రాత్రి సమావేశమైన మిషన్ నిర్వాహకులు ఆర్టెమిస్ ప్రయోగంపై సమీక్ష జరిపి లాంచింగ్పై నిర్ణయం తీసుకున్నారు. ఉష్ణమండల తుఫాను నికోల్ ఫ్లోరిడాపై ప్రభావం చూపిన కొన్ని రోజులకే ఈ మిషన్కు నాసా పచ్చా జెండా ఊపడం విశేషం. చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ఉద్దేశించిన ఈ మిషన్ ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. ఆర్టెమిస్-1 ప్రయోగం సాంకేతికమైనది. ఈ స్పేస్ క్యాప్సూల్లో మనుషులను నాసా పంపడం లేదు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే.. 2024 లో ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి తీసుకెళ్లాలని నాసా భావిస్తున్నది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది. అయితే, ప్రస్తుతం ఈ మిషన్లోని ఓరియన్ క్యాప్సూల్ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిరానున్నది. ఆర్టెమిస్-3 ని 2025 ప్రయోగించేందుకు నాసా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. సెప్టెంబర్ 3 వ తేదీన ప్రయోగానికి అంతా సిద్ధం చేసిన తర్వాత లాంఛ్ సిస్టమ్ రాకెట్లో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవుతుండటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. తొలుత ఈ ప్రయోగాన్ని ఆగస్టు 29 న వాయిదా వేశారు. అపోలో ప్రాజెక్టు అనంతరం 50 ఏండ్ల తర్వాత మరోసారి మనుషుల్ని చంద్రుడిపైకి పంపేందుకు ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 1972 లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత మళ్లీ వ్యోమగాములను పంపే ప్రయత్నం జరుగలేదు.
0 Comments