యాపిల్కు అతిపెద్ద తయారీ భాగస్వామి సంస్థ, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ భారత్లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. చైనా నుండి ఉత్పత్తిని తరలించడంపై యాపిల్ ప్రయత్నిస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. డ్రాగన్ కంట్రీలో రోజుకు 20 వేలు అంతకన్నా ఎక్కువ కోవిడ్ కేసులు విజృంభిస్తున్న కారణంగా అక్కడ అమలు చేస్తున్న కఠిన లాక్ డౌన్ నిబంధనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీలో తయారీని కొనసాగించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీలో క్వారంటైన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులో నెలల తరబడి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఇనుప కంచెలు వేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు. కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. ఐఫోన్ తయారీని చైనా వెలుపలి దేశాలకు తరలించాలని యాపిల్ తన కాంట్రాక్ట్ తయారీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. మార్కెట్ కేపిటలైజేషన్ వ్యాల్యూలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీగా యాపిల్ తన ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఈ తరుణంలో యాపిల్ సూచనతో ఫాక్స్కాన్ భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఫాక్స్కాన్ 2019 నుండి మనదేశంలో యాపిల్ ఐఫోన్ 11 నుంచి తయారీని ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 మోడల్ను అసెంబుల్ చేస్తోంది. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఇతర ప్రొడక్ట్లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
0 Comments