మొబైల్ పనిచేయాలంటే బ్యాటరీ ఛార్జ్ చేయాల్సిందే. అందుకే చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్లేప్పుడు పూర్తి ఛార్జింగ్ పెట్టుకొని వెళుతుంటారు. తరచుగా ప్రయాణించే వారు మొబైల్ను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా బస్టాండ్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ల గురించి అమెరికన్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్బీ ఛార్జర్లతో యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయొద్దని ఎఫ్బీఐ సూచించింది. ఈ యూఎస్బీ కేబుల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. మాల్స్, ఎయిర్పోర్ట్ సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండే ఉచిత యూఎస్బీ ఛార్జింగ్ కేబుళ్లకు బదులు, యూజర్లు తమ సొంత ఛార్జర్లలో పవర్ ప్లగ్కు కనెక్ట్ చేసి మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎఫ్బీఐ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. జ్యూస్ జాకింగ్ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో యూఎస్బీ ఛార్జర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టి యూజర్ల వ్యక్తిగత, బ్యాకింగ్ సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది. అలానే బహిరంగ ప్రదేశాల్లోని వైఫై నెట్వర్క్కు కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేదా వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం వంటివి చేయొద్దని సూచించింది. ఆన్లైన్ ఖాతాలకు పటిష్టమైన పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
0 Comments