Ad Code

ఈ బైక్‌కి ఇంత క్రేజేంటో?

 

ప్రముఖ విద్యుత్‌ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లికార్ప్‌ తీసుకొచ్చిన రివోల్ట్‌ ఆర్‌వీ400 మరోసారి అమ్మకాల్లో దూసుకెళ్లింది. గురువారం బుకింగ్స్‌ ప్రారంభించగా.. నిమిషాల్లోనే బైక్‌లన్నీ అమ్ముడయ్యాయని రివోల్ట్‌ తెలిపింది. అయితే, ఎన్ని బైక్‌లను విక్రయానికి ఉంచారో మాత్రం తెలియజేయలేదు. గత నెల తొలిసారి బుకింగ్స్‌లోనూ రివోల్ట్‌ సత్తా చాటింది. తొలి రెండు గంటల్లోనే రూ.50 కోట్లు విలువ చేసే బైక్‌లకు ఆర్డర్లు అందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌, ముంబయి, పుణె, దిల్లీ, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లో ఈ బైక్‌లను బుకింగ్‌కి అందుబాటులో ఉంచారు. 3.24కిలోవాట్ల లిథియం ఆయాన్‌ బ్యాటరీతో రూపొందించిన ఆర్‌వీ 400 ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఈ బ్యాటరీకి ఎనిమిదేళ్లు లేదా 1.5లక్షల కిలోమీటర్ల వరకూ సంస్థ హామీనిస్తోంది. బ్యాటరీ మొత్తం ఛార్జింగ్‌ అయ్యేందుకు నాలుగున్నర గంటలు పడుతుంది. సీబీఎస్‌ బ్రేకింగ్‌ సిస్టం, సర్దుబాటు చేయగలిగే మోనోషాక్‌, ప్లాస్టిక్‌ చైన్‌ ఈ బైకు ప్రత్యేకతలు. గూగుల్‌ భాగస్వామ్యంతో రివోల్ట్‌తో అనుసంధానించిన హెల్మెట్‌ను అందిస్తున్నారు. ''రీవోల్ట్‌ స్టార్ట్‌'' అనే వాయిస్‌ కమాండ్‌ను ఉపయోగించి వాహనాన్ని స్టార్ట్‌ చేయొచ్చు. ‘మైరివోల్ట్‌ యాప్‌’ ద్వారా బైక్‌ను ఆపరేట్‌ చేయొచ్చు. ఈ యాప్‌ను బైక్‌కు అనుసంధానించడం ద్వారా బైక్‌ లోకేటర్‌, బైక్‌లోని సాంకేతిక సమస్యలు, బ్యాటరీ స్టేటస్‌, ప్రయాణ చరిత్ర, దగ్గరలోని రివోల్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ వంటి ఫీచర్లను తెలుసుకోవచ్చు. బుకింగ్‌ చేసుకున్న తర్వాత రెండు నెలల్లోపు వాహనం అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. ఆర్‌వీ 400 ధర రూ.1,03,999(ఎక్స్‌షోరూం).

Post a Comment

0 Comments

Close Menu