విమాన ప్రయాణాలను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏవియేషన్ రంగంలోని అడుగుపెడుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా. తక్కువ ధరల్లోనే విమానయాన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ లైన్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆకాశ 'పేరుతో ఏర్పాటు చేయనున్న ఆ సంస్థ పనులు వేగం అందుకుంటున్నాయి. ఝున్ఝున్వాలాతో కలిసి జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబె 'ఆకాశ'ను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే మరో దిగ్గజ వ్యాపారవేత్త వీరితో జతకలుస్తున్నారు. ఇండియా ఎయిర్లైన్స్ మాజీ ప్రెసిడెంట్ అదిత్య ఘోష్ సైతం రాకేశ్ బృందంలో చేరనున్నారని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఝున్ఝున్వాలాకు నామినీగా ఆదిత్య ఘోష్ ఉండనున్నారట. ఆకాశ ఎయిర్లైన్స్లో ఆదిత్య ఘోష్కు 10 శాతం వాటా ఉంటుందట. అయితే మేనేజ్మెంట్లో మాత్రం ఆయన భాగంగా ఉండరట. కేవలం ఝున్ఝున్వాలాకు నామినీగా మాత్రమే వ్యవహరిస్తారని సమాచారం. 'ఆకాశ'లో ఝున్ఝున్వాలాకు 40 శాతం వాటా ఉంది. వినయ్ దూబెకు 15 శాతం వాటా ఉంది. దాంతోపాటు సీఈవో పోస్టు అదనం. ఆకాశలో ఎయిర్ బీఎన్బీ, పర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లాంటి ఇన్వెస్టర్లు ఉన్న విషయం తెలిసిందే. యూఎస్ చవక విమానయాన సంస్థ సన్ కంట్రీ ఎయిర్లైన్స్లో వీరు భాగం. మొత్తానికి విమాన ప్రయాణాలను చవక ధరల్లోనే అందించాలనే లక్ష్యంతో పనిచేసిన ప్రముఖులు ఇప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్ టీమ్లో భాగమవుతున్నారు.
'అల్ట్రా లో కాస్ట్ కేరియర్' (యూఎల్సీసీ) అంటే చవక విమానయాన సంస్థ 'ఆకాశ్'తో ఆదిత్య ఘోష్... తిరిగి విమానయాన పరిశ్రమలోకి ఎంటర్ అవుతున్నారన్నమాట. 2018లో ఆయన ఇండిగో ప్రెసిడెంట్, లైఫ్టైమ్ డైరెక్టర్ హోదా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫాబ్ ఇండియా, ఓయో రూమ్స్లో బోర్డ్ మెంబర్గా ఉన్నారు. అయితే 'ఆకాశ'లో చేరుతున్నారనే విషయంపై ఆదిత్య ఘోష్ ఇప్పటివరకు స్పందిచలేదు. ఆయన ఇండిగో 10 ఏళ్లపాటు కొనసాగారు. 160 విమానాలను నిర్వహిస్తున్న ఇండిగోకు మార్కెట్లో ₹55 వేల కోట్లు షేర్ ఉంది
ఇదిలా ఉండగా ఆకాశ ఎయిర్లైన్స్కు సీవోవో నియామక ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందట. జెట్ ఎయిర్వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్ను ఆ పోస్టులో నియమిస్తున్నారట. మరోవైపు సీటీవోగా గోఎయిర్ రెవెన్యూ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ శ్రీనివాసన్ను నియమిస్తున్నారట. దాంతోపాటు జెట్ప్లయిట్ ఆపరేషన్స్ వైస్ప్రెసిడెంట్ ఫ్లాయిడ్ గ్రేసియస్ కూడా సీటీవోగా వస్తారట. విమానయాన రంగంలో సీనియర్ అయిన నీలూ ఖత్రీ కార్పొరేట్ అఫైర్స్ హెడ్గా వస్తారని సమాచారం. 35 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చవక విమానయాన సంస్థగా 'ఆకాశ'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఏవియేషన్ మినిస్ట్రీకి దరఖాస్తు పెట్టుకున్నారు. 'ఆకాశ'లో 70 విమానాలను నిర్వహించాలని నిర్ణయించారు.
0 Comments