ఉత్తర ప్రదేశ్లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. కాగా, వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు. ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు.
0 Comments