భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్ స్పీడ్కు కారణమవుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద.. నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్, హెచ్యూఎల్, టైటన్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. గురువారం కూడా స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటనలు, చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ నుండి వచ్చిన ఊరట ప్రకటన, దీనిని గట్టెక్కించేందుకు చైనా బ్యాంకులు ముందుకు రావడం వంటి వివిధ అంశాలు కలిసి వచ్చాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా అనంతరం ఇటీవల రియాల్టీ మార్కెట్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకేరోజులో పెద్ద మొత్తంలో విక్రయాలు జరిపినట్లు వెల్లడించింది. ఇది రియాల్టీ సూచీ పరుగుకు కారణమైంది. శుక్రవారం మార్కెట్లు ప్రారంభం కాగానే 60 వేల మార్క్ దాటుతుందని బావించారు. అందరూ అనుకున్నట్టే చరిత్ర ఆవిష్కృతమైంది. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నుండి చారిత్రాత్మక 60,000 మైలురాయిని చేరటానికి 31 సంవత్సరాలు పట్టింది. జూలై 25, 1990 న సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల ల్యాండ్ మార్క్ టచ్ చేసింది. మార్చి 4, 2015 న 30 వేల మార్కును తాకడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. అయితే మరో ముప్పయ్ వేల పాయింట్లు చేరటానికి కేవలం ఆరు సంవత్సరాలే కావటం విశేషం. వరసగా ఐదు వారాల నుంచి బుల్ రన్ కంటిన్యూ అవుతోంది.
0 Comments