ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రం నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదిమానవుని అడుగుజాడలు వెలుగుచూశాయి. సాగర్ ఎగువన, నల్లొండ జిల్లా పెద్ద అడిసేర్లపల్లి మండలం పుట్టంగండి పంచాయతీ పరిధిలోని పావురాల గుట్టకు సమీపంలో ఆనవాళ్లు బయటపడ్డాయి. కృష్ణానది ఒడ్డున పెద్ద పలుగు గుట్టపై ఇందుకు ఆధారాలున్నాయని పురావస్తు పరిశోధకుడు, బౌద్ధనిపుణులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. క్షేత్రపర్యటనలో భాగంగా గురువారం గుట్టపై మూడు చోట్ల 5 నుంచి 8 సెంటీమీటర్ల వ్యాసం, ఒక సెంటీమీటర్ లోతుతో బిడిసె రాళ్లను గుర్తించినట్లు చెప్పారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పశుపాలనతో పాటు వ్యవసాయం చేసిన కొత్త రాతియుగపు మానవులు పదునైన మొనగల నల్ల శానపు రాతి గొడ్డళ్లు తయారు చేసుకునేవారని, పెద్ద పలుగు రాతి గుట్ట వారి పనిముట్ల తయారీ కేంద్రంగా ఉండేదని గుట్టపై ఉన్న గుంతలు రుజువు చేస్తున్నాయి. పలుగు గుట్టకు దిగువన ఉన్న కొత్త రాతియుగపు కొండచరియ ఆవాసాలను కూడా పరిశీలించామన్నారు. ఇక్కడ ఆర్కియాలజికల్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు వోఎస్డీ కద్దూరి సుధన్రెడ్డి, నర్సింగరావు, పావురాలగుట్ట యువకుడు గోసంగి సైదులు పాల్గొన్నారు.