గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్ష బరిలో నిలుస్తామని పలువురు ప్రకటించడం.. సినీ ప్రముఖులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే ఇప్పుడు మా ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన హేమ, జీవితా రాజశేఖర్ లు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తెలిపారు. శుక్రవారం సిని'మా'బిడ్డలం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాష్ రాజ్.. తన ప్యానెల్ లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. "సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేయాలని ఉంది. మాకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తాం. గతంలో కొందరు సభ్యులతో విలేకరుల ముందుకు వచ్చారు. వారంతా ప్యానల్ సభ్యులు కాదు. నా శ్రేయోభిలాషులు మాత్రమే. ఇప్పుడు మా ప్యానెల్ను ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకూ సమాన అవకాశం కల్పిస్తున్నాం. అందరూ హేమ, జీవితా రాజశేఖర్లు అధ్యక్ష బరిలో నిలుస్తారని భావించారు. ఈ విషయమై వారితో మాట్లాడా. మా కార్యచరణను వారి ముందు ఉంచాను. ఆ విషయాలన్నీ వారికి నచ్చాయి. దీంతో నా ప్యానెల్లో పోటీ చేయడానికి వారు ఒప్పుకొన్నారు" అని ప్రకాష్ రాజ్ వివరించారు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అనేలా పోటీ మారిందనే చెప్పాలి.
0 Comments