Ad Code

భానుమతీ రామకృష్ణ


భానుమతీ రామకృష్ణ  దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర, విప్రనారాయణ, బొబ్బిలి యుధ్ధం, మంగమ్మ గారి మనవడు ,పెళ్ళికానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఈమె ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వర విక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

భానుమతి 1926 వ సంవత్సరము సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు. ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.

2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది.

భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది. భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది.

Post a Comment

0 Comments

Close Menu