భారత మీడియా రంగంలో కీలక విలీనం ఒప్పందం దాదాపు ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థ 'జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జెడ్ఈఈఎల్)', 'సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)' మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం వాటాలుంటాయి. ఎస్పీఎన్ఐకు 52.93 శాతం వాటాలు దక్కుతాయి. ఒప్పందం ప్రకారం.. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. అలాగే ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించను న్నారు. ఆర్థికపరమైన అంశాలే కాకుండా సోనీతో భాగస్వామ్యం వల్ల రానున్న వ్యూహాత్మక విలువను కూడా పరిగణనలోకి తీసుకున్నామని జీ బోర్డు తెలిపింది. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని వెల్లడించింది. ఇకపై ఇరు కంపెనీలు లీనియర్ నెట్వర్క్స్, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ ఆపరేషన్స్, ప్రోగ్రాం లైబ్రరీస్ వంటి వ్యవహారాలను పంచుకోనున్నాయి. ఇక ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు నిర్దేశించారు. ఈ సమయంలో జీ ప్రమోటర్ల కుటుంబం.. 4 శాతంగా ఉన్న తమ ప్రస్తుత వాటాల్ని 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒప్పందం ప్రకారం... విలీనం తర్వాత ఏర్పడే బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లను సోనీ గ్రూపే నియమిస్తుంది.
'జీ'కి కంటెంట్ క్రియేషన్లో మంచి అనుభవం ఉంది. అలాగే గత మూడు దశాబ్దాలుగా వినియోగదారులకు చేరువైంది. మరోవైపు గేమింగ్, స్పోర్ట్స్ వంటి ఎంటర్టైన్మెంట్ రంగాల్లో సోనీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు భారీ ఆదరణతో పాటు వ్యూహాత్మక విలువ చేకూరుతుందని భావిస్తున్నారు.
0 Comments