గాంధీజీ అహింస సిద్ధాంతం వల్లే స్వాతంత్య్రం వచ్చిందన్న ప్రచారం వాస్తవం కాదు. అలాగే కేవలం నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ వల్లనే వచ్చిందన్న మాట వాస్తవం కాదు-అనితా బోస్. స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాన్నకు, గాంధీజీకి మధ్య సంబంధాలు అంత బాగుండేవి కావన్నారు. కానీ తమ నాన్నకు గాంధీజీ అంటే చాలా అభిమానమన్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీజీ, నెహ్రూ ఇద్దరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధమయ్యారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ గాంధీజీ, నేతాజీలు ఇద్దరూ గొప్ప నాయకులన్నారు. ఒకరు లేకుండా ఒకరిని ఊహించుకోలేమన్నారు. అయితే కేవలం అహింసా సిద్ధాంతం వల్లే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందంటూ చాలాకాలం నుంచి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ పోషించిన పాత్ర మనందరికి తెలుసునన్నారు. అలానే కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చింది అనే ప్రచారం కూడా వాస్తవం కాదన్నారు. కొందరు స్వాతంత్య్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివితక్కువతనం అంటూ పరోక్షంగా కంగనాను విమర్శించారు.
0 Comments