ఫ్యూయల్ ఫర్ ఇండియా-2021 అనే వర్చువల్ సదస్సును మెటా (ఫేస్బుక్) సంస్థ బుధవారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ వర్చువల్ ఈవెంట్లో ఇండియా గురించి మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ మాట్లాడారు. భారతదేశం లేకపోతే తన నెక్స్ట్ డ్రీమ్ నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నట్లుగా జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జుకర్బర్గ్ మెటావర్స్ అనే ఓ ఫ్యూచర్ సోషల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్లాట్ఫాం క్రియేట్ చేయాలనే పెద్ద లక్ష్యంతో ముందడుగులు వేస్తున్నారు. ఈ ప్లాట్ఫాం వేదికగా ప్రజలు వర్చువల్గా ఇంటరాక్ట్ కావచ్చు. అయితే ఈ మెటావర్స్ అభివృద్ధిలో ఇండియా కీలక పాత్ర పోషించబోతోందని జుకర్బర్గ్ వర్చువల్ ఈవెంట్లో చెప్పడం విశేషం. "ఈ మెటావర్స్ను అభివృద్ధి చేయడంలో భారతదేశం పోషించే పాత్ర గురించి నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఇంజనీర్లు, డెవలపర్లు, క్రియేటర్లు, అలాగే ఇండియాలోని స్టార్ట్-అప్ ఎకో-సిస్టమ్ ఫ్యూచర్ ఇంటర్నెట్ మెటావర్స్ను రూపొందించడంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద యాప్ డెవలపర్ బేస్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఓ అతిపెద్ద స్పార్క్ AR డెవలపర్ కమ్యూనిటీని కలిగి ఉంది. భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం గత కొన్నేళ్లుగా చాలా వృద్ధిని సాధించింది. ఇండియాలో గేమింగ్లో మన పెట్టుబడి పెరుగుతూనే ఉంది. మరి మెటావర్స్లో ఇది ఎలా రూపుదిద్దుకోబోతుందో మనం చూడాలి" అని ఆయన అన్నారు.
0 Comments