Ad Code

పేటీఎం ట్రాన్సిట్ కార్డు !


వినియోగదారుల రోజువారీ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త కార్డును ఇటీవల ఆవిష్కరించింది.. వన్​ నేషన్​ వన్​ కార్డ్​ నినాదంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్​ యూజర్ల కోసం సరికొత్త ట్రాన్సిట్​ కార్డును విడుదల చేసింది. ఈ కార్డు మునుపెన్నడూ లేని విధంగా మీ లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఈ కార్డును వినియోగదారులు తమ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. మెట్రో, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, మర్చంట్  స్టోర్లలో, టోల్​ పార్కింగ్​ ఛార్జీలు, ఆన్​లైన్​ షాపింగ్​ పేమెంట్స్​ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఈ కార్డు ద్వారా మీరు ఏటీఎం నుంచి డబ్బు కూడా విత్​డ్రా చేసుకోవచ్చు. భారతీయులందరికీ బ్యాంకింగ్​ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఈ ట్రాన్సిట్​ కార్డును ప్రారంభించామని పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఒక ప్రకటనలో తెలిపింది. మిలియన్ల కొద్దీ భారతీయుల రోజువారీ అవసరాలకు చేసే చెల్లింపులను ఒకే ఫిజికల్ కార్డుతో అందించాలనే ఉద్దేశంతో ఈ కార్డును విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ట్రాన్సిట్​ కార్డు నేరుగా పేటీఎం వ్యాలెట్​తో లింక్​ చేసి ఉంటుంది. ఈ కార్డును దరఖాస్తు చేసుకున్న యూజర్లకు నేరుగా వారి ఇంటికే డెలివరీ చేస్తుంది. పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ పరిచయంతో, వినియోగదారులు ఇకపై అన్ని రకాల కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. పేటీఎం సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్​తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ట్రాన్సిట్​ కార్డుతో నేరుగా మెట్రో ఛార్జీలను చెల్లించవచ్చు. ట్రాన్సిట్ కార్డ్ ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్, అహ్మదాబాద్ మెట్రోలో అందుబాటులో ఉంది. వినియోగదారుల అన్ని అవసరాలను ఒకే కార్డుతో తీర్చాలని పేటీఎం భావించింది. ఈ 'వన్ నేషన్ వన్ కార్డ్' నినాదంతోనే కొత్త కార్డును ఆవిష్కరించింది.  మెట్రో, బస్సు, రైలు సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించే 50 లక్షలకు పైగా రైడర్లకు ఈ ట్రాన్సిట్​ కార్డ్ ఉపయోగపడుతుందని పేటీఎం పేర్కొంది. వినియోగదారులు పేటీఎం యాప్​ ద్వారా ట్రాన్సిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పేటీఎం సేల్స్ పాయింట్ల నుంచి కూడా వినియోగదారులు కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డును నేరుగా పేటీఎం వాలెట్‌కి లింక్ చేయవచ్చు. పేటీఎం యాప్‌లోనే అన్ని లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu