పార్లమెంట్ సమావేశాల ఫీడ్ను అందించే సంసద్ టీవీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో యూట్యూబ్ కూడా ఆ చానెల్ను యూట్యూబ్లో బ్లాక్ చేసింది. చానెల్ హ్యాక్కు గురవడంతో వెంటనే యూట్యూబ్ ఆ చానెల్ను యూట్యూబ్ నుంచి టెర్మినేట్ చేసేసింది. ప్రస్తుతం ఈ చానెల్ యూట్యూబ్లో అందుబాటులో లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశం నిర్వహించినా.. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించాలన్నా.. సంసద్ టీవీ ద్వారా ప్రసారాలను ప్రజలకు చేరవేస్తారు. అటువంటి చానెల్పై స్కామర్ల కన్ను పడింది అంటే.. స్కామర్లు ఎందుకు ఈ చానెల్ను హ్యాక్ చేశారో.. దాని వెనుక ఉన్న వాళ్ల ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి సంసద్ టీవీ చానెల్ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. దానికి ఇథీరియం అనే పేరు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన సంసద్ చానెల్ సోషల్ మీడియా టీమ్.. చానెల్ను హ్యాకర్ల బారి నుంచి కాపాడగలిగింది. వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు సమాచారం అందించాం. ఈ విషయం తెలియడంతో యూట్యూబ్ వెంటనే చానెల్ను బ్లాక్ చేసింది.. అని సంసద్ టీవీ ప్రకటించింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఉల్లంఘించినందున సంసద్ టీవీని టెంపరరీగా బ్లాక్ చేశామని.. త్వరలోనే సెక్యూరిటీ త్రెట్స్ను ఫిక్స్ చేసి సంసద్ టీవీని తిరిగి యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతామని యూట్యూబ్ కూడా వెల్లడించింది. వాస్తవానికి సంసద్ టీవీ యూట్యూబ్లో వెరిఫై చేసిన అకౌంట్. ఇదివరకు ఈ చానెల్ పేరు రాజ్యసభ టీవీగా ఉండేది. గత సంవత్సరమే దానికి సంసద్ టీవీ అని పేరు మార్చారు. లోక్సభ, రాజ్యసభ… రెండు సభల సమావేశాలను ప్రస్తుతం సంసద్ టీవీ ద్వారానే అందిస్తున్నారు. సంసద్ టీవీకి యూట్యూబ్లో 6.32 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
0 Comments