ప్రస్తుతం యూత్కు బాగా కనెక్ట్ అయిన యాప్ స్నాప్చాట్. అందుకు తగ్గట్టుగానే స్నాప్చాట్ మెసేంజర్ యాప్ యూజర్లను కొత్త సదుపాయాలతో ఆకట్టుకొంటోంది. ఏటా వినియోగదారుల సంఖ్యను, యాక్టివ్ యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకొంటోంది. ఇటీవలే వీడియో కాలింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన స్నాప్చాట్ ఇప్పుడు మరికొన్ని సదుపాయాలను అందించేందుకు ముస్తాబైంది. ఈ కాలంలో స్నేహితులు, బంధువుల భద్రతకు ఎంతో అవసరమైన లొకేషన్ షేర్ చేసుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా యూట్యూబ్ మ్యూజిక్కు షేర్ చేసుకొనే ఫీచర్ను కూడా వినియోగదారులకు అందిస్తోంది. గత అక్టోబరు నెలలో ఐఓఎస్ డివైజెస్లో యూట్యూబ్ మ్యూజిక్ను స్నాప్చాట్లో షేర్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ సదుపాయం ఆండ్రాయిడ్ ఫోన్లపై కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు 9 టూ 5 గూగుల్ అనే సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. ఆండ్రాయిడ్ డివైజెస్లో య్యూటూబ్ మ్యూజిక్ ఓపెన్ చేసి షేర్ బటన్పై క్లిక్ చేసినప్పుడు స్నాప్చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ లిస్టులో స్నాప్చాట్ సెలక్ట్ చేసుకొంటే యూట్యూబ్ మ్యూజిక్లో వింటున్న వాటిని షేర్ చేసుకోవచ్చు. ఆర్ట్ వర్క్ ఫర్ ద ఆల్బమ్, ఆర్టిస్ట్ నేమ్, యాప్ లోగో, పాట వినేందుకు అవసరమైన లోగో వంటివి షేర్ అవుతాయి. వీటితోపాటు స్నాప్చాట్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్నాప్చాట్ యూజర్లు కనీసం 15 నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు స్నేహితులకు లొకేషన్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ సదుపాయం ఈ కాలంలో చాలా ప్రధానమైంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా వారు ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రమాదం ఏర్పడినా ఈ ఫీచర్ ద్వారా వెంటనే తెలుసుకొని అవసరమైన సాయం అందించవచ్చు. దీనికి సంబంధించి శుక్రవారం స్నాప్చాట్ ఓ ట్వీట్ కూడా చేసింది. స్నాప్చాట్లో లొకేషన్ షేర్ చేసుకొనే సదుపాయం వినియోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులు సురక్షితంగా ఇంటికి చేరుకొనేలా చూడండి అని పేర్కొంది. ఐఓఎస్ డివైజెస్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నా ఫైండ్ మై యాప్ అనే ఫీచర్ తరహాలో పనిచేస్తుంది. ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ సాయంతో ఇతరులతో తాము ఉన్న కచ్చితమైన లొకేషన్ వివరాలు పంచుకోవచ్చు. రెండు డివైజెస్లో ఈ యాప్ ఆన్ చేసి ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న స్నాప్చాట్ యూజర్లు దేశంలో గణనీయంగా పెరిగారు. డైలీ యాక్టివ్ యూజర్స్ సంఖ్య దాదాపు 150 శాతం పెరిగినట్లు స్నాప్చాట్ పేర్కొంది. యాప్లో రోజుకు సగటున ఐదు బిలియన్ స్నాప్లు క్రియేట్ అవుతున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ(AR) ద్వారా రెండేళ్లలో 1500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేలా నీతి ఆయోగ్తో స్నాప్చాట్ ఒప్పందం చేసుకొంది. దేశవ్యాప్తంగా AR టెక్నాలజీని స్నాప్చాట్ అందుబాటులోకి తీసుకురానుంది. అటల్ ఇన్నొవేషన్ డైరక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ.. 'డిజిటల్ ఇండియా సాకారంలో AR చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది' అని వివరించారు.
0 Comments