గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. పట్నంవాసులతో పోలిస్తే పల్లె ప్రజలే ఎక్కువగా వాడుతున్నారు. సిటీల్లో 29.4 కోట్ల మంది నెట్యూజర్లుండగా, పల్లెల్లో ఆ సంఖ్య 35.2 కోట్లుగా ఉంది. అంటే పట్నంతో పోలిస్తే పల్లెల్లో ఇంటర్నెట్ వాడకం 20 శాతం ఎక్కువగా ఉండడం విశేషం. 'భారత్ 2.0 ఇంటర్నెట్ స్టడీ' పేరుతో నీల్సన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ నిరుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 27,900 కుటుంబాల్లోని 1.10 లక్షల మందిని సర్వే చేశారు. 2019 నుంచి రెండేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 45 శాతం పెరిగినా.. ఇంకా 60 శాతం మందికి ఆ సేవలు అందట్లేదని ఆ సర్వే తేల్చింది. నగరవాసుల్లో 59 శాతం మంది నెట్ వాడుతుండగా.. రెండేండ్లలో 28 శాతం వృద్ధి నమోదైనట్టు సర్వేలో వెల్లడైంది. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 64.6 కోట్లు. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 60% పెరిగింది. 12 ఏండ్లు నిండిన వాళ్లలో 59.2 కోట్ల మంది ఇంటర్నెట్ వాడేస్తున్నారు. రెండేండ్లలో ఆ సంఖ్య 37% పెరిగింది. ఇక ఇంటర్నెట్ వాడుతున్నోళ్లలో 60% మంది మహిళలే ఉన్నారు. రెండేండ్లలోనే మహిళా వినియోగదారులు 61% పెరిగారు. నెట్ వాడుతున్న మగవారిలో 28% వృద్ధి మాత్రమే నమోదైంది. నెట్ వాడుతున్న మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు (33%) పల్లెలకు చెందినోళ్లే. ఇటు 50 ఏండ్లు నిండిన యూజర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆ ఏజ్ గ్రూప్లోని 81 శాతం మంది నెట్ వాడుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్ లేని యూజర్లుండడం చాలా అరుదు. ఏ కొద్దిపాటి సమయం దొరికినా సోషల్ మీడియాలో దోస్తులతో బాతాఖానీ కొట్టేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వాడకంలో సోషల్ మీడియా వినియోగమే ఎక్కువగా ఉన్నట్టు నీల్సన్ సర్వేలో తేలింది. 50.03 కోట్ల మంది కేవలం సోషల్ మీడియా, ఆన్లైన్ వీడియోలు, మ్యూజిక్ కోసమే ఇంటర్నెట్ను వాడుతున్నారు. ఆన్లైన్ వీడియోలు చూస్తున్న 44 కోట్ల మంది యూజర్లలో 54% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారు. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ కోసం నెట్ను వాడుతున్నారు. ఈ విషయంలో పట్టణ జనాలే ముందున్నారు. అందులోనూ 47% మంది కొత్తవాళ్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్, ఆన్లైన్ పేమెంట్ల కోసం నెట్ను వాడుతున్న వారి సంఖ్య ఎక్కువుంది. అందులో 66% మంది 20 నుంచి 39 ఏండ్ల మధ్య వాళ్లే ఉన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు చేస్తున్నోళ్లలో గ్రామీణ ప్రాంతాల వారి సంఖ్య 46%. ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్న వారిలో మగవాళ్లే ఎక్కువ. 100లో 69 మంది పురుషులు ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల సేవలను వాడుకుంటుంటే.. ఆడవాళ్ల సంఖ్య 31గా ఉంది. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల యుగమైపోయింది. తక్కువధరకే బడ్జెట్ఫోన్లు వస్తుండడం, టెలికాం ఆపరేటర్లు తక్కువ ధరకే నెట్ సేవలను అందిస్తుండడంతో చాలా మందికి అది చేరువైపోయింది. దానికి తోడు గ్రామీణులకు నెట్ సేవలను దగ్గర చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'భారత్ నెట్' పేరుతో స్కీమును ప్రవేశపెట్టడం, 'డిజిటల్' సర్వీసులకు శ్రీకారం చుట్టడం, రాష్ట్రాల ప్రభుత్వాలూ ఆ దిశగా చర్యలు తీసుకుంటుండడం వల్ల నెట్ వాడకం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
0 Comments