హైదరాబాద్కి చెందిన బ్లూసెమీ అనే సంస్థ “ఏవ” డివైజ్ని రూపొందించింది. ఈ హెల్త్ గాడ్జెట్ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆల్గారిథమ్స్, స్మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని సాయంతో సూది గుచ్చకుండా, రక్తపు చుక్క బయటికి రాకుండా 6 పరీక్షలు చేయొచ్చు. 1. బ్లడ్ గ్లూకోజ్ లెవల్ 2. హీమోగ్లోబిన్ ఏ1సీ 3. ఈసీజీ 4. హార్ట్ రేట్ 5. బ్లడ్ ప్రెజర్ (బీపీ) 6. ఆక్సీజన్ శాచురేషన్. ఏవ పరికరం మీద బొటన వేలుని పెడితే చాలు. ఈ ఆరు పరీక్షల ఫలితాలు నిమిషంలో ప్రత్యక్షమవుతాయి. దీనికి అనుబంధంగా పనిచేసే ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. దాని సాయంతో మన శరీరానికి సంబంధించిన డైలీ హెల్త్ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్, న్యూట్రిషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన సమస్యలేమైనా తలెత్తితే వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు తక్షణం డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ పొందొచ్చు. ఏ రోజు ఏ ఫుడ్ తింటున్నామో, దాన్నిబట్టి షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఇన్స్టంట్ రిజల్ట్స్ మంత్లీ టెస్టుల్లో బయటపడవు. “నిత్యం డయగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్లటం లేదా హోమ్ టెస్ట్ కిట్లు కొనుక్కోవటం ఖరీదైన వ్యవహారం. ఒక్కసారి ఏవ డివైజ్ని తీసుకుంటే తక్కువ ఖర్చుతో పనైపోతుంది” అని బ్లూసెమీ సంస్థ ఫౌండర్, సీఈఓ మద్దికట్ల సునిల్ అన్నారు. నైట్ డ్యూటీల వల్ల గానీ ఇతరత్రా కారణాల వల్ల గానీ 25-40 ఏళ్ల మధ్య వయసువారు రోజూ లేటుగా నిద్రపోతుంటారు. అందువల్ల పొద్దున లేటుగా లేస్తారు. ఫలితంగా బ్రేక్ ఫాస్ట్ చేయరు. డైరెక్ట్ లంచ్ లాగించేస్తారు. అందులోనూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. శారీరక ఆరోగ్యం కోసం వర్కౌట్లు చేయరు. అందుకే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ల కోసమే ఏవ పరికరాన్ని డెవలప్ చేసిట్లు సునిల్ తెలిపారు. ఏవ ధర రూ.15,500. కుటుంబంలో నలుగురు మనుషులు వాడుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా రూ.4000 ఖర్చు వస్తుంది. డయగ్నాస్టిక్ సెంటర్లతో పోల్చితే ఇది 95 శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
0 Comments