రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ను శుక్రవారం విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీ వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థల్ని రీప్లేస్ చేయడం లక్ష్యం కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సాధారణంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ రూపాయి ప్రణాళికాబద్ధమైన ఫీచర్స్ తెలపడమే ఈ కాన్సెప్ట్ నోట్ జారీ వెనుక ఉద్దేశమని ఆర్బీఐ వివరించింది. ఆర్బీఐ రూపొందించే డిజిటల్ కరెన్సీకి e₹ అని పేరు పెట్టారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ ఆధ్వర్యంలో వస్తుంది. డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి e₹ అదనంగా ఉంటుంది. బ్యాంకు నోట్లకు భిన్నంగా ఏమీ ఉండదు. కానీ డిజిటల్గా ఉండటం వల్ల సులభంగా, వేగంగా, చౌకగా ఉంటుంది. ఇది ఇతర రకాల డిజిటల్ కరెన్సీకి ఉన్నట్టుగానే లావాదేవీ ప్రయోజనాలు ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని పేపర్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో కూడా ఉంటుంది. చట్టబద్ధంగా ఎక్కడైనా చెల్లుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లాంఛ్ చేయనుంది ఆర్బీఐ. 2023 మార్చి 31 లోగా ఎప్పుడైనా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అందు బాటు లోకి రావొచ్చు. త్వరలోనే కొన్ని లావాదేవీల కోసం పైలట్ పద్ధతిలో ఇ-రుపీ లాంఛ్ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత దశల వారీగా డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విస్తరిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ లాంఛ్ అయిన తర్వాత డిజిటల్ కరెన్సీ ఫీచర్స్ని, e₹ ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వివరిస్తామని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో ఉన్నట్టు, డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. కరెన్సీ నోటుకు ఎంత విలువ ఉంటుందో డిజిటల్ రుపీకి అంతే విలువ ఉంటుంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో వస్తున్న డిజిటల్ కరెన్సీ కాబట్టి కరెన్సీ నోట్ల చెల్లుబాటుకు ఆర్బీఐ ఎలా బాధ్యత తీసుకుంటుందో, డిజిటల్ కరెన్సీ చెల్లుబాటు బాధ్యత కూడా ఆర్బీఐదే.
0 Comments