ఢిల్లీలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం సాయంత్రం 266 మార్కును తాకింది. ఇది చాలా ఆధ్వాన్నమైన స్థాయి అని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ సంస్థ పేర్కొన్నది. ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో అయితే మరింత అధ్వాన్నంగా AQI 327గా ఉన్నదని SAFAR తెలిపింది. కాగా, ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ప్రజలు విష వాయువులనే పీల్చుకుంటున్నారని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ చెప్పారు. వాయు కాలుష్యం వల్ల ఆస్తమా లాంటి లంగ్స్ సంబంధ అరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని మాత్రమే జనానికి తెలుసని సేథ్ అన్నారు. ఊపిరితిత్తులతోపాటు గుండెకు కూడా వాయు కాలుష్యం వల్ల చాలా ప్రమాదం ఉందని డాక్టర్ సేథ్ హెచ్చరిస్తున్నారు. ఈ అంశంలో ఎలాంటి అజాగ్రత్త తగదని ఆయన చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో యుక్త వయసులో ఉన్న చాలామంది గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని, దానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమన్నది తన అభిప్రాయమని డాక్టర్ సేథ్ చెప్పారు. గత 20 ఏండ్ల నుంచి వాయు కాలుష్యం వేగంగా పెరుగుతున్నదని పలు పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు.
0 Comments