ఐటీ ఉద్యోగులు మరో జాబ్ చేసే మూన్లైటింగ్ కల్చర్పై హాట్ డిబేట్ సాగుతున్న సమయంలో దాదాపు పది శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రెండవ జాబ్ చేస్తున్నారని తాజా నివేదిక స్పష్టం చేసింది. లాక్డౌన్ సమయంలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పటి నుంచి మూన్లైటింగ్ ట్రెండ్ ముందుకొచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఐటీ ఉద్యోగులు తమ రెగ్యులర్ జాబ్ చేస్తూనే ఫ్రీలాన్స్ ప్రాజెక్టులను చేపడతుండటంపై ఐటీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మూన్లైటింగ్పై విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలు ఉద్యోగుల తీరును తప్పుబడుతున్నాయి. మూన్లైటింగ్కు సహకరించే వెసులుబాటు కలిగిన జాబ్ల కోసం ఉద్యోగులు దృష్టిసారిస్తుంటే టెక్ దిగ్గజాలు మాత్రం మూన్లైటింగ్కు పాల్పడుతూ దొరికిపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. భారత్లో 9 శాతం ఐటీ ఉద్యోగులు మూన్లైటింగ్ కొనసాగిస్తున్నారని అవుత్బ్రిడ్జ్ రీసెర్చి వెల్లడించింది. పూర్తికాలం జాబ్ చేస్తూ పార్ట్టైమ్ అవకాశాలు లేదా మూన్లైటింగ్ కోసం చూస్తున్న ఉద్యోగులెవరో 65 శాతం ఐటీ ఉద్యోగులకు తెలుసని కొటాక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటాస్ చేపట్టిన మరో సర్వే వెల్లడించింది. మూన్లైటింగ్ను, పార్ట్ టైం ఉద్యోగాలను పలు టెక్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పలు కంపెనీలు మూన్లైటింగ్ను వ్యతిరేకిస్తుండగా టెక్ మహింద్ర మాత్రం తమ ఉద్యోగుల ఐడియాను సపోర్ట్ చేసింది. ఇక గత నెలలో రెండవ ఉద్యోగం చేస్తూ పట్టుబడిన 300 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించామని విప్రో చీఫ్ రిషద్ ప్రేమ్జీ ప్రకటించారు. మూన్లైటింగ్ మోసపూరిత వ్యవహారమని ఆయన అభివర్ణించారు. ఇక ప్రత్యర్ధి కంపెనీల్లో సెకండరీ జాబ్ చేయడం నైతిక పరమైన అంశాలని టీసీఎస్ పేర్కొంది. మూన్లైటింగ్తో తమకు సమస్యల్లేకున్నా ఈ అంశానికి షరతులు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. తాజాగా మూన్లైటింగ్కు పాల్పడుతున్న పలువురు ఉద్యోగులను కంపెనీ తొలగించిందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలిల్ పరేఖ్ ఇటీవల ప్రకటించారు.
0 Comments