వాట్సాప్ యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. ఇప్పటివరకూ జరిగిన ఆన్లైన్ యూజర్ల అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఇదొకటి కావచ్చు. దాదాపు 50కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశారు. సైబర్న్యూస్ నివేదిక ప్రకారం హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్లో 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్ల 2022 డేటాబేస్ను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక ప్రకటనను పోస్ట్ చేశాడు. డేటాబేస్ US, UK, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ సహా 84 వేర్వేరు దేశాల నుంచి WhatsApp యూజర్ల మొబైల్ నంబర్లను కలిగి ఉంది. ఉల్లంఘనకు గురైన డేటాలో ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్ ద్వారానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లకు దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటా సెట్ లో 32 మిలియన్ల అమెరికన్ వాట్సాప్ యూజర్ల రికార్డ్లు ఉన్నాయని గుర్తించారు. అదే విధంగా, వాట్సాప్ ప్రభావిత యూజర్లు ఈజిప్ట్లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్లో 20 మిలియన్లు, టర్కీలో 20 మిలియన్లు ఉన్నారు. డేటాబేస్లో దాదాపు 10 మిలియన్ల రష్యన్లు, 11 మిలియన్లకు పైగా యూకే పౌరుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. అమెరికా డేటాసెట్ను 7,000 డాలర్లకి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్ల ధర వరుసగా 2,500 డాలర్లు, 2,000 డాలర్లు గా ఉన్నాయి. ఆన్లైన్లో పోస్ట్ చేసిన భారీ డేటా సెట్లు స్క్రాప్ చేయడం ద్వారా WhatsApp సేవా నిబంధనలను ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. అన్ని ఫోన్ నంబర్లు మెటా-యాజమాన్య ప్లాట్ఫారమ్లోని యాక్టివ్ యూజర్లకు చెందినవని అంటున్నారు. అసలు వాట్సాప్ డేటాబేస్ ఎలా యాక్సస్ చేశాడనేది మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడానికి సీక్రెట్ వ్యూహాన్ని ఉపయోగించినట్టు నివేదిక తెలిపింది.
0 Comments