కార్ల మోడల్ రేంజ్ ధరలను వచ్చే ఏడాది నుంచి పెంచనున్నట్లు హోండా ప్రకటించింది. దాదాపు రూ.30వేల వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు, రాబోయే కఠిన ఉద్గార నిబంధలకు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసేందుకు ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. బీఎస్-6 రెండో దశ ప్రమాణాలు వచ్చేడాది ఏప్రిల్ 2023 నుంచి అమలులోకి రానున్నాయి. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుంగా కంపెనీలు ఆధునిక విడిభాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల స్థాయిని ఎప్పటికప్పుడు గుర్తించే పరికరాలను కంపెనీలు అమర్చాల్సి ఉంటుంది. నిర్ధిష్ట స్థాయిని దాటి కాలుష్యాన్ని వెలువరిస్తే వార్నింగ్ లైట్లు వెలిగి.. సర్వీస్కు పంపాలని సూచిస్తాయి. దీంతో పాటు మండాల్సిన ఇంధన పరిమాణాన్ని కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ చేసిన ప్యూయల్ ఇంజెక్టర్స్ను అమర్చాల్సి ఉంటుంది. వాహనంలో వాడే కొన్ని సెమీకండక్టర్లను సైతం అప్గ్రేడ్ చేయాల్సి రానున్నది. దీంతో మార్పులు చేయాల్సి రావడంతో వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
0 Comments