ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఎడాపెడా కొలువుల కోతకు దిగుతున్న క్రమంలో చైనాకు చెందిన ఫోన్ తయారీ కంపెనీ షియోమి మాస్ లేఆఫ్స్కు ప్రకటించింది. షియోమి తన స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సర్వీసుల బిజినెస్కు సంబంధించిన పలు యూనిట్లలో పనిచేసే ఉద్యోగుల్లో ఏకంగా 15 శాతం మంది విధుల నుంచి తొలగించినట్టు తెలిసింది. బాధిత ఉద్యోగులు, చైనా మీడియా సంస్ధల సోషల్ మీడియా పోస్టుల్లో లేఆఫ్స్ కలకలం వెలుగుచూసిందని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. షియోమిలో 35,314 మంది పనిచేస్తుండగా వీరిలో 32,000 మందికి పైగా చైనాలో పనిచేస్తున్నారు. తాజా లేఆఫ్స్తో కంపెనీలో పనిచేసే వేలాది మంది వీధినపడ్డారు. వీరిలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన హైరింగ్లో ఎంపికై కొత్తగా కొలువుల్లో చేరినవారూ ఉన్నారు. నవంబర్లో షియోమి థర్డ్ క్వార్టర్ రాబడి ఏకంగా 9.7 శాతం పడిపోయిన నేపధ్యంలో కొలువుల కోత వార్తలు వెలుగుచూడటం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా చైనా సోషల్ మీడియా వేదికలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాజా లేఆఫ్స్తో చైనాలో మరిన్ని కంపెనీల్లోనూ కొలువుల కోత ఉంటుందనే సంకేతాలు పంపినట్టయిందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments