ప్యాసింజర్ వెహికల్ (పీవీలు) రిటైల్ అమ్మకాలు డిసెంబరులో రికార్డు స్థాయిలో ఉన్నాయని కంపెనీలు చెబుతున్నాయి. త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉండటం, ఇయర్-ఎండ్ తగ్గింపులు, ఆఫర్ల కారణంగా కస్టమర్లు కార్ల షోరూమ్లకు క్యూలు కట్టారు. త్వరలో మరింత కఠినమైన కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే బండ్ల ధరలు పెరుగుతాయి. అందుకే కొందరు డిసెంబరులోనే కొనేశారు. దీంతో పీవీ సేల్స్ నాలుగు లక్షల యూనిట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. 2018 డిసెంబర్లో అమ్మకాలు 3.82 లక్షల యూనిట్లుగా రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటి వరకు నెలవారీ రికార్డు. కస్టమర్లతో క్యాలెండర్ సంవత్సరం చివరి నెలలో కార్లను కొనిపించాలంటే తగ్గింపులు తప్పనిసరి. అందుకే డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, క్యాష్ బ్యాక్లు ఇచ్చారు. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) రూల్స్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి స్టాక్ వేగంగా అమ్ముడయిందని మారుతీ సుజుకి ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఎస్యూవీల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయని మారుతి శ్రీవాస్తవ చెప్పారు. ఆర్డీఈ నిబంధనల వల్ల కార్ల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే వెహికల్స్ విడుదల చేసే కాలుష్యాల స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి సెల్ఫ్డయోగ్నస్టిక్స్ కిట్లు ఉండటం తప్పనిసరి. ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా చిన్న డీజిల్ కార్లను తయారు చేయడం కంపెనీలకు వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. అందుకే చాలా కారు మోడల్స్ను కంపెనీలు దశలవారీగా తొలగిస్తున్నాయని హ్యుందాయ్కు చెందిన తరుణ్ గార్గ్ అన్నారు. ధరలు తగ్గినందున ప్రస్తుతం వీటి అమ్మకాలు చురుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. భారీగా వెహికల్స్ అందుబాటులో ఉండటం, డిస్కౌంట్లు, పాజిటివ్ సెంటిమెంట్స్ వల్ల సేల్స్ పెరిగాయని గార్గ్ చెప్పారు.
0 Comments