శామ్సంగ్ ఫోన్లలో బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్గా 'మెసేజ్ గార్డ్' ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు ఎక్కువ. సైబర్ నేరగాళ్లు ఈ ఫోన్లను సులువుగా హ్యాకింగ్ చేస్తుంటారు. ఓ చిన్న లింక్ని క్లిక్ చేస్తే చాలు ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేయడం వల్ల, మెసేజ్ లింక్పై క్లిక్ చేయడం వల్ల లేదా ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయడం వల్ల ఫోన్ని హ్యాక్ చేస్తున్నారు. వీటిల్లో హానికారక కోడ్ని ప్రవేశపెట్టి.. వాటిపై క్లిక్ చేయగానే ఫోన్లో ఇన్స్టాల్ అయ్యేలా సైబర్ కేటుగాళ్లు డిజైన్ చేస్తున్నారు. ఇది తెలియకుండా స్మార్ట్ఫోన్ యూజర్లు బుట్టలో పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి శామ్సంగ్ 'మెసేజ్ గార్డ్' సెక్యూరిటీ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్లోకి వచ్చిన మెసేజ్లు, ఇమేజ్లను ఓపెన్ చేసే సమయంలో ఈ 'మెసేజ్ గార్డ్' వాటిని బ్యాక్గ్రౌండ్లో స్కాన్ చేస్తుంది. తద్వారా అది హానికరమైనదా? సాధారణమైన కంటెంటా అనే విషయాన్ని తేల్చుతుంది. ఒకవేళ హానికరమైన కంటెంట్ అయితే దానిని ఓపెన్ చేయనీయకుండా నియంత్రిస్తుంది. ఇలా 'మెసేజ్ గార్డ్' ఫీచర్ యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ శామ్సంగ్, గూగుల్ మెసేజెస్ యాప్లకు కంపాటబుల్ అవుతుంది. త్వరలోనే వాట్సప్ వంటి థర్డ్ పార్టీ యాప్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. తొలుత 'మెసేజ్ గార్డ్' సెక్యూరిటీ ఫీచర్ని గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లలో తీసుకురానున్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే 'మెసేజ్ గార్డ్' ఫీచర్ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. వచ్చే ఏడాది నుంచి ఇతర గెలాక్సీ ఫోన్లలో కూడా 'మెసేజ్ గార్డ్' సెక్యూరిటీ ఫీచర్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సమీప భవిష్యత్తులో ఈ ఫీచర్ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఇంటిగ్రేట్ చేయనుందని తెలిపింది.
0 Comments