టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్లోని హెచ్ఆర్ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు క్రిస్ విలియమ్స్ రాసిన ఓ కథనం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఎవరికి ఉందన్నది ఆ ఆర్టికల్ ముఖ్య సారాంశం. పలు కారణాలతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, లింక్డిన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తు్న్నాయి. కాగా, ఈ తొలగింపు పర్వంతో టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. క్రిస్ కథనం ప్రకారం.. ఈవెంట్ ప్లానింగ్ టీమ్, కొత్త ఇనిషియేటివ్స్ టీమ్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ మూడు రకాల ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కంపెనీల్లో ఎక్కువ రిస్క్ ఉండేది కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే అని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో కంపెనీలు కాంట్రాక్టు కార్మికులను వెసులుబాటు కోసం నియమించుకుంటాయని, అయితే కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటగా తొలగించేది కాంట్రాక్ట్ ఉద్యోగులనేనని వివరించారు. తర్వాత కంపెనీల్లోని ఈవెంట్ ప్లానింగ్ విభాగంతోపాటు సంబంధిత ఇతర డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులూ జాబ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కంపెనీలు మాంద్యం సమయంలో ఉద్యోగులకు టూర్లు, ఇతర సదుపాయాలను కల్పించని కారణంగా తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. అలాంటి సమయంలో ఈవెంట్ ప్లానింగ్ సిబ్బంది అవసరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగులపై కూడా లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని క్రిస్ తన కథనంలో వివరించారు. ఇదే సందర్భంలో కంపెనీలో రిస్క్లేని ఉద్యోగాలను కూడా క్రిస్ ప్రస్తావించారు. సంస్థలకు నేరుగా లాభాలు తెచ్చిపెట్టే కీలకమైన విభాగాల్లోని ఉద్యోగుల ఉద్యోగాలు సేఫ్ అని చెప్పారు. వారిని తొలగించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. మాన వవనరులు, ఫైనాన్స్ విభాగాల్లోని ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఆయా విభాగాల్లో సిబ్బంది సహజంగానే పరిమితంగా ఉంటారు కాబట్టి అక్కడ కోతలకు ఆస్కారం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వారిని తొలగించాల్సి వస్తే మాత్రం కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తాయని క్రిస్ తన కథనంలో వివరించారు.
0 Comments