Ad Code

వాట్సాప్‌లో సచివాలయాల సేవలు !


ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం 'నవరత్నాల' పేరిట అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా, లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా వాట్సాప్‌ ద్వారా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్‌లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు.. ఈ సేవల కోసమే ఒక మొబైల్‌ నంబరును కేటాయించి ఆ నంబరుకు ఎవరైనా కేవలం మెసేజ్‌ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వా­ట్సా­ప్‌ అకౌంట్‌ను ఇప్పటికే తెరిచినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఉదా.. ఎవరైనా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఆ సమాచారం వాట్సాప్‌ ద్వారా దరఖాస్తుదారుడి మొ­బైల్‌ నెంబరుకు ఇవ్వడంతోపాటు ఆయా ధ్రు­వీకరణ పత్రాలను కూడా మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని నెలన్నర రోజు­లుగా అమలుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్నపని ఉన్నా మండల, జిల్లా ఆఫీసుల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. అన్ని అర్హతలు ఉండి పింఛను లేదా రేషన్‌కార్డు లేదా మరోదాని కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. అదెప్పుడు మంజూరవుతుందో తెలీని దుస్థితి. పైగా మంజూరు కాకపోతే ఎందుకు కాలేదో కూడా చెప్పే దిక్కుండదు. సరైన సమాచారమిచ్చే నాథుడేలేక దరఖాస్తుదారునికి చుక్కలు కనిపించేవి. వైఎస్‌ జగన్ సీఎం అయ్యాక పింఛన్లు, రేషన్‌ పంపిణీ లబ్ధిదారుల గడప వద్దే అందుతున్నాయి. ప్రభుత్వం ఏ సంక్షేమ పథ­కం అమలుచేస్తున్నా ఆ పథకం అర్హుల వివరాలతో పాటు, తిరస్కరణకు గురైన వారి వివరాలు, ఎందుకు తిరస్కరణకు గురయ్యాయన్న సమా­చారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా కూడా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు పూర్తిస్థాయిలో అమలుచేసే విధానం అమలులోకి వస్తే.. సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచే సమాచారం కూడా ప్రజలు వాట్సాప్‌ ద్వారా తెలుసుకునే వీలు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే వాట్సాప్‌ నెంబరుకు కేవలం 'హాయ్‌' అని మెసేజ్‌ చేస్తే చాలు.. ఆ సమయంలో పథకాల పేర్లు వాట్సాప్‌ మెసేజ్‌లో ప్రత్యక్షమవుతాయి. తాము తెలుసుకోదలిచిన పథకం ఎంపిక చేసుకుని ఎవరికి వారు తమ ఆధార్‌ నెంబరు నమోదుచేస్తే అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అనర్హులుగా పేర్కొంటే ఆ వివరాలు కూడా ఆ సమాచారంలో తెలుస్తాయి. దీనికితోడు.. పింఛను, రేషన్‌కార్డు వంటి వాటితో ఏవైనా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఏ అధికారి పరిశీలనలో ఉందన్న సమాచారం ఆ దరఖాస్తుదారునికి వాట్సాప్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu