Ad Code

పారిస్‌ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై నిషేధం !


ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో ఎలక్ట్రిక్‌ స్ట్కూటర్లపై నిషేధం విధించింది.  దీనికి కారణం లేకపోలేదు. పారిస్‌ నగరంలో 2018లో తొలిసారి అద్దెకు ఈ-స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని నగరంలో ప్రయాణించవచ్చు. వీటి వేగం గంటకు 20 కి.మీ దాటకూడదు. రెండేళ్ల కాలంలో పారిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఈ-స్కూటర్లు కారణమని అధికారులు నివేదించారు. ఈ-స్కూటర్ల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 24 మంది చనిపోగా, 2022లో 459 ప్రమాదాలు జరిగాయని పారిస్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, వీటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో  18 ఏళ్లలోపు వయసువారు కూడా అద్దెకు తీసుకుని రోడ్లపై రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. వీటి పార్కింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై వదిలేసి వెళుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఈ-స్కూటర్లపై నిషేధం విధించారు. సెప్టెంబరు నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ-స్కూటర్ల కోసం నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువ మంది ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పారిస్‌ నగరపాలక సంస్థ ఈ-స్కూటర్ల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పారిస్‌లో 15,000 ఈ-స్కూటర్లు ఉన్నాయి. వీటిని లైమ్‌, డాట్‌, టైర్‌ అనే మూడు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. తాజా నిర్ణయంతో సెప్టెంబరు నుంచి ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ-స్కూటర్ల కోసం నిర్వహించిన ఓటింగ్‌లో సుమారు లక్ష మంది పాల్గొనగా, ఇందులో 89 శాతం మంది వాటిపై నిషేధించాలంటూ ఓటేశారని పారిస్‌ నగర మేయర్ అన్నే హిడాల్గో తెలిపారు. ఈ-స్కూటర్ల ఆపరేటర్లు మాత్రం పారిస్‌ నగరపాలక సంస్థ ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu