భారత ఐటీ కంపెనీలు క్యాంపస్ హైరింగ్ను ఏకంగా 40 శాతం తగ్గించాయి. ఆర్ధిక మందగమనం వెంటాడటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతుండగా క్యాంపస్ హైరింగ్ పైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. లేఆఫ్స్తో పాటు ఐటీలో నెలకొన్న స్ధబ్ధత కారణంగా 2024లో క్యాంపస్ హైరింగ్ మందకొడిగా ఉంటుందని రిక్రూట్మెంట్ కంపెనీ టీమ్లీజ్ డిజిటల్ పేర్కొంది. 2023లో ఐటీ కంపెనీలు 2,30,000 మందిని క్యాంపస్ల నుంచి రిక్రూట్ చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,55,00కు పరిమితం కానుందని అంచనా వేసింది. తాము ఇప్పటికే అభ్యర్ధులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, అంందుకే తాము క్యాంపస్ రిక్రూట్మెంట్కు ఈసారి వెళ్లడం లేదని విప్రో హెచ్ఆర్ చీఫ్ సౌరవ్ గోవిల్ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే టాలెంట్ పరిస్దితి ప్రస్తుతం భిన్నంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ధిక అనిశ్చితి నేపధ్యంలో హైరింగ్ ప్రాధాన్యతలు మారాయని తెలిపారు. కాగా ఫ్రెషర్ల జాబ్ ఆఫర్ల వేతనాన్ని 50 శాతం కోత విధించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో విప్రో నిర్ణయించిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
0 Comments