ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ వెల్లడించారు. పెట్టుబడుల ద్వారా "జనరేటివ్ ఏఐ" అనే కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ ప్రస్తుతం కన్సల్టింగ్, డిజైన్, ఇంజనీరింగ్ కార్యకలాపాలు వంటి వివిధ రంగాలలో తమ ఉద్యోగుల పనిని వేగవంతం చేసే "జనరేటివ్ ఏఐ" అనే కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చెప్పారు. మార్కెట్ లో ఇతర ఐటీ సంస్థలను ఎదుర్కొని నిలబడేందుకు చాట్ జీపీటీలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఐటీ సంస్థల్లో కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్ 3,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ ఎస్.రవి కుమార్ వెల్లడించారు. అలాగే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 11 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను కూడా వదులుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్ నికర లాభంలో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 11.2 శాతం అధికం. అయితే.. పరిశ్రమలో అత్యల్పంగా 14.6 శాతం మార్జిన్లు మాత్రమే కంపెనీ నమోదు చేసినట్లు తెలిపింది. దీంతో భవిష్యత్ అంచనాలను సవరించింది. పూర్తి ఏడాదికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తోంది. మొత్తం 3,500 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం కూడా కొన్ని కార్యాలయాలను కూడా కాగ్నిజెంట్ మూసివేయబోతోంది. కాగ్నిజెంట్ పేరుకే అమెరికా కంపెనీ అయినప్పటికీ కార్యకలాపాలు ఎక్కువగా భారత్లోనే కొనసాగుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ప్రస్తుతం కాగ్నిజెంట్లో 3,51,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 2 లక్షల వరకు భారత్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12న కాగ్నిజెంట్ సీఈఓగా రవి కుమార్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈఓగా పనిచేసిన బ్రెయిన్ హంఫ్రీస్ను అనూహ్యంగా విధుల నుంచి తప్పించడంతో ఆ బాధ్యతలను రవి కుమార్ స్వీకరించారు.
0 Comments