హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ గ్రామంలో దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ భాగస్వామి ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం సోమవారం భూమి పూజ చేయనుంది. దీంతో అందరి దృష్టీ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ కొత్త ప్లాంట్ పైనే పడింది. ఆ సంస్థ తైవాన్ కు చెందింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు భూమిపూజ చేయనున్నారు. అనంతరం జరిగే సభకు దాదాపు 10 వేల మంది హాజరుకానున్నారు. ఫాక్స్కాన్ సంస్థకు రాష్ట్ర సర్కారు 196 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా 35,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్ లో దాదాపు రూ.5.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయనుంది. ఓ వైపు, అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు పదే పదే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తమ ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి కూడా తరలించాలని ఆపిల్ సంస్థ భావిస్తోంది. ఇదే సమయంలో ఆపిల్ భాగస్వామి ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఫాక్స్కాన్ చాలా కాలంగా భారత్ లో ఐఫోన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇన్నాళ్లకు ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడింది. అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంతేగాక, ఎలక్ట్రానిక్ వాహనాల పార్టులను కూడా ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
0 Comments