ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది. భారత్లో పనిచేస్తున్న పలువురు టాప్ ఉద్యోగులపై కూడా ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. మెటా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, మీడియా భాగస్వామ్యాల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్, మెటా ఇండియా లీగల్ డైరెక్టర్ అమృతా ముఖర్జీతో సహా భారత్లోని కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్లు పదవీ విరమణ చేయాల్సిందిగా యాజయాన్యం కోరినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు ఈ ఏడాది మార్చిలో సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపును ఏప్రిల్, మేలో రెండు విడతలగా చేపడతామని వెల్లడించారు. అందులోభాగంగానే ఏప్రిల్లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన మెటా, మిగిలిన 6వేల మంది ఉద్యోగుల్ని తాజాగా తొలగించింది. కాగా, జాబ్ కోల్పోయిన ఉద్యోగులు లింక్డిన్ పోస్టుల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
0 Comments