భారత్లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ తెలిపారు. చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్ చేయడానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. 2030 నాటికి భారత్లోని అన్ని బిజినెస్ల్లో 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. ఇండియాలోని స్టార్టప్లు, ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులకు ప్రోత్సాహం, డిజిటలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు పోటీ పడేలా మద్దతు ఇస్తామని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీతో టెక్ దిగ్గజాల సీఈఓలు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత అమెజాన్ బ్లాగ్పోస్ట్లో భారత్ లో భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలను ఆండీ జస్సీ బయటపెట్టారు. 2030 నాటికి అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రూ.1.09 లక్షల కోట్ల (12.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడులకు ఇది అదనం కానున్నది. భారత్లో కోటి చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి అమెజాన్ చర్యలు తీసుకుంటుందని ఆండీ జస్సీ తెలిపారు. వచ్చే రెండేండ్లలో భారత్ నుంచి విదేశాలకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని, కొత్తగా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు భారత్లో 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు.
0 Comments