డిజిటల్ బ్యాంకింగ్ కస్టమర్లకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తోంది. ట్రాన్సాక్షన్లను త్వరగా పూర్తి చేసేలా కస్టమర్లకు బ్యాంకులు సహకరిస్తున్నాయి. ఇందుకోసం పటిష్ఠమైన భద్రతా చర్యలను పాటిస్తున్నాయి. అయితే ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. డబ్బులు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గాన్ని అన్వేషిస్తున్నారు. యూజర్లకు తెలియకుండానే వలలో వేసుకుంటున్నారు. ప్రధానంగా ఆండ్రాయిడ్ యూజర్లను సైబర్ కేటుగాళ్లు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. వెబ్ అప్లికేషన్ల రూపంలో మోసాలకు తెరదీసి అందిన కాడికి దోచుకుంటున్నారు. మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుతున్నారు. గతంలో ఓ హానికారక యాప్ను డెవలప్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేసేవారు. ఈ యాప్ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లోని సమాచారం మొత్తం సైబర్ నేరస్థుల చేతికి వెళ్లేది. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో గూగుల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డెవలపర్లు తమ యాప్ను అప్లోడ్ చేయాలంటే D-U-N-S నంబర్ను తప్పనిసరిగా సమర్పించేలా రూల్ పెట్టింది. ఇదొక యూనిక్ నంబర్. డెవలపర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. దీంతో అప్లికేషన్ల మోసాలకు అడ్డుకట్ట పడింది. కానీ, సైబర్ నేరగాళ్లు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. వెబ్ అప్లికేషన్ టెక్నాలజీతో తిరిగి మోసాలు ప్రారంభించారు. వెబ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేయడానికి స్టోర్తో సంబంధం లేదు. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్(PWAs)ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీకే టెక్నాలజీ సహాయ పడుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఆండ్రాయిడ్ యూజర్లకు వలేస్తున్నారు. ఎస్ఎంఎస్ మెసేజ్ రూపంలో లింక్లు పంపించి ఏమారుస్తున్నారు. ఫోన్లో ఉన్న యాప్లను అప్డేట్ చేసుకోవాలని లేదా కొత్త యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజ్లు పంపుతారు. వీటిని నమ్మి లింక్ని క్లిక్ చేయగానే హానికర వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆ తర్వాత యాప్ డౌన్లోడ్ అయ్యి ఫోన్లోని సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తుంది. ఇలా మోసపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ వంటి అధికారిక సోర్సు నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. హానికార యాప్లను ఇది నిరోధిస్తుంది. థర్డ్ పార్టీ సోర్సుల నుంచి యాప్లను ఇన్స్టాల్ చేయకూడదు. ఇలా అడుగుతున్నాయంటే వాటిలో హానికర లింక్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి యాప్లకు దూరంగా ఉండాలి. ఈ అత్యాధునిక డిజిటల్ క్షేత్రంలో యాంటీవైరస్ అప్లికేషన్ తప్పక వాడాలి. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్లలో యాంటీవైరస్లను మెయింటెన్ చేస్తే మాల్వేర్ అటాక్ నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. వీటిని కూడా ట్రస్టెడ్ సోర్సుల నుంచే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫోన్కి ఎన్నో ఎస్ఎంఎష్ మెసేజులు వస్తుంటాయి. వాటిలో అనుమానాస్పద లింక్లు ఉంటాయి. ఇలాంటి వాటిని ఊరికే క్లిక్ చేయొద్దు. ఇలా చేస్తే మోసపోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకుల పేరిట ఇలాంటి మెసేజ్లు ఎక్కువగా వస్తుంటాయి. కానీ, ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. టెక్ట్స్ మెసేజ్ల నుంచి సర్వీసులు డౌన్లోడ్ చేసుకోవాలని బ్యాంకులు యూజర్లను కోరవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. https://t.me/offerbazaramzon
0 Comments